ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

421
triple-talaq
- Advertisement -

ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ట్రిపుల్ తలాఖ్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు.

పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది.

triple-talaq

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను చేపట్టారు. సభకు హాజరైన సభ్యులందరికీ స్లిప్పులను పంపిణీ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆర్జేడీ, వైసీపీ, టీఎంసీ, బీఎస్‌పీ, ఆప్, వామపక్షాలు ఓటేశాయి. టీఆర్‌ఎస్, టీడీపీ, జేడీయూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై విపక్షాల సవరణలు వీగిపోయాయి. బిల్లును సెలెక్ట్ ప్యానెల్‌కు పంపాలన్న డిమాండ్ తిరస్కరణకు గురైంది. ఉభయసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును త్వరలోనే రాష్ర్టపతి కోవింద్ వద్దకు పంపనున్నారు. త్రిపుల్ తలాక్ బిల్లును రాష్ర్టపతి ఆమోదించగానే అది చట్టరూపం దాల్చనుంది.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. తలాక్ పద్దతిని ఇస్లామిక్ దేశాలు సైతం నిషేధించాయని, లౌకికదేశమైన భారత్‌లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయలేకపోయామని బిల్లు ప్రవేశం సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -