టీవీలు పెద్దగా లేనప్పుడు.. ఇంటర్నెట్ అసలే లేనప్సుడు..హిట్టు సినిమాల్ని రీరిలీజ్ చేయడం.. వాటిని జనాలు ఇరగబడి చూడటం జరిగింది. అంతేకాకుండా సెకండ్ రిలీజ్లో సైతం స్టార్ హీరోల సినిమాలు 50 రోజులు.. 100 రోజులు.. ఆడేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను కూడా జనాలు థియేటర్ కి వెళ్ళి చూసే పరిస్థితి కనిపించలేట్లేదు. ఎందుకంటే..ఎప్పుడు ఏ సినిమా చూడాలనుకుంటే ఆ సినిమాలు మొబైల్లోనే దొరికేస్తున్నాయి.

అయితే ఈ రోజుల్లో పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు ? అసలు అలాంటి సినిమాలను రీ రిలీజ్ చెయ్యడానికి థియేటర్స్ దొరుకుతాయా..? అయినా.. కొత్త సినిమాలనే సరిగ్గా థియేటర్ కి వెళ్ళి చూడని జనాలు..ఇక పాత సినిమాలని ఏం చూస్తారు ? అని ఇలా ఎవరైనా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే..! ఎందుకంటే..ఇలాంటి పరిస్థితుల్లో కూడా 22 ఏళ్ల నాటి ఒక సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. బాషా. రజినీకాంత్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు. 1995 జనవరి 12న విడుదలై సంచలన విజయం సాధించిన ‘బాషా’కు 5.1 సరౌండ్
సౌండింగ్ సిస్టం.. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ జోడించి. డిజిటలైజ్ చేసి మళ్లీ ఇప్పుడు తమిళనాట విడుదల చేశారు. రీ రిలీజ్ అంటే ఏదో ఒకటి రెండు థియేటర్లలో కాదు. తమిళనాట పెద్ద సంఖ్యలోనే థియేటర్లు ఇచ్చారు ఈ సినిమాకు. చెన్నైలోని ప్రతి మల్టీప్లెక్సులోనూ ఈ సినిమా ఆడుతూ దుమ్ములేపుతోంది. ఒక కొత్త సినిమాను చూసినట్లుగా జనాలు ‘బాషా’ కొత్త వెర్షన్ ను విరగబడి చూస్తున్నారు. అప్పుడు ‘బాషా’ చూసి ఉర్రూతలూగిపోయినవాళ్ళు. అప్పటికి చిన్న వయసులో ఉండి రజినీ

ప్రభంజనాన్ని ఆస్వాదించలేకపోయినవాళ్ళు.. ఇలా అందరూ ఇప్పుడు థియేటర్లకు ఎగబడుతున్నారు. రజినీ కెరీర్లో మైలురాయిగా మిగిలిపోయిన ఈ సినిమాను మళ్లీ ఇలా అభిమానుల సందడి మధ్య చూడటాన్ని కొత్తగా ఫీలవుతున్నారు. సెలబ్రెటీలందరూ సాధారణ రజినీ అభిమానుల్లా మారిపోయి తమ ఎగ్జైంట్మెంట్ను పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇలా ఓ పాత సినిమాతోనూ బాక్సాఫీస్లో కళ తేవడం ఒక్క రజినీకి మాత్రమే సాధ్యమేమో.

