అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాలా పాటల పండగ అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రజనీ చేసిన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తిని రేపాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ పని ముగిసిన తరువాత చనిపోయినా ఫర్వాలేదని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలా మంది అడుగుతూ ఉంటారని చెప్పిన ఆయన, గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని అన్నారు. తాను మరో సినిమా చేసిన ప్రతిసారీ, ఇక రజనీకాంత్ పని అయిపోయిందని చాలా మంది అంటుంటారని, గత నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది ఇదే మాటన్నా తాను పట్టించుకోలేదని తెలిపారు.
ఈ గుర్రం ఇంకా పరుగులు పెడుతోందేమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నేను పరుగులేమీ పెట్టడం లేదు. నడుస్తున్నానంతే. ఆ దేవుడే నడిపిస్తున్నాడు. అందువల్లే ఎవరేమి చెప్పినా నా దారిలో నేను వెళుతుంటానని చెప్పారు. ఇది ఎన్నో రాజకీయ అంశాలతో కూడివున్న చిత్రమని చెప్పారు.
ఈ ఫంక్షన్ ఆడియో వేడుకలా లేదని, సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందని చెప్పారు. ‘శివాజీ’ సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. వర్షం, కార్మికుల సమ్మె కారణంగా సినిమా చిత్రీకరణకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, రంజిత్ అనుకున్నదానికన్నా బాగా తీశారని చెప్పారు.