పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు వాయిదా..

138
- Advertisement -

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌​ ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన పునీత్‌ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. అయితే పునీత్‌ అంత్యక్రియలు ఈ రోజు జరగాల్సివుండగా.. ఆదివారానికి వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు.

పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను అక్టోబర్ 31, ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్‌ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్‌ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ సీఎం విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -