కర్ణాటక నుంచే బీజేపీ పతనం…

292
Prakash Raj questions PM Narendra Modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేసుకుని మరోసారి విమర్శలు గుప్పించారు నటుడు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్‌ పేరుతో కొంతకాలంగా బీజేపీ,మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శులు చేస్తున్న ప్రకాష్…కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీపై వ్యంగ్యాస్త్రలు విసిరారు. సింధనూరులో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య రక్షణ కోసం కార్యక్రమంలో మోడీపై మండిపడ్డారు.

2019 తర్వాత మోడీకి దేశంలో పనిఉండదని ఎద్దేవా చేశారు. నాలుగైదు సభల్లో మోడీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. కాయగూరలు అమ్మినట్లు ఈ భాష ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..అంటూ చురకలంటించారు. రాహుల్‌గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోడీని ప్రకాష్‌ తీవ్రంగా విమర్శించారు. రాహుల్‌ వయసెంత..మీ వయసెంత మోడీజీ.. సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు.

మోడీ భాష కాయగూరలు అమ్మినట్లు ఉందన్నారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నాకేం భయం లేదని చెప్పారు. బీజేపీ నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మంచివా? అని ప్రశ్నించారు. ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? అని జోస్యం చెప్పారు. కర్ణాటక నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందన్నారు.

- Advertisement -