మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ఈ పోటీలో సినీ నటుడు ప్రకాశ్రాజ్, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్, హేమ కూడా నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాశ్ రాజ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
27 మందితో తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన ఆయన శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష బరిలోకి సడన్గా రాలేదని, ఏడాదిగా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చామని అన్నారు. సీనీ కార్మికల సమస్యల పరిష్కారం కోసమే తాను అధ్యక్ష బరిలోకి దిగుతున్నానని నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు.
తన ప్యానల్లోని సభ్యులంతా స్వయం కృషితో పైకి వచ్చినవారేనని చెప్పారు. తమది ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానల్ అని, మంచి చేయడానికి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చెప్పారు. తాను తప్పు చేస్తే బయటకు పంపే వాళ్లు తన ప్యానల్లో ఉన్నారన్నారు. “మా”అసోసియేషన్ రాజకీయ పార్టీ కాదని, ఇక్కడ ఉన్నవారంతా మహానుభావులేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. సమస్యల గురించి మాట్లాడక.. లోకల్, నాన్ లోక్ ఇష్యూ తెరపైకి తేవడం దారుణమన్నారు. గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్లోకల్ ఎందుకు కాలేదని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.