ఈనెల 27న హైదరాబాద్ కొంపల్లిలో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ 27వ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలోని 31 జిల్లాల నుంచే కాకుండా 20 దేశాల నుంచి ప్రతినిధులు ప్లీనరీకి హాజరుకానున్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా ప్లీనరీ నిలవనుందని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో పొలిటికల్ వర్గాల్లో హిట్ పెంచింది.
ఈ నేపథ్యంలో ప్లీనరీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మతం, సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఉన్మాదానికి పాల్పడుతున్న బీజేపీ శ్రేణులపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రకాష్…ఈ ప్లీనరీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలె సీఎం కేసీఆర్తో భేటీ అయిన ప్రకాష్ ..థర్డ్ ఫ్రంట్ ఆలోచనను స్వాగతించారు. కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు.
అంతేగాదు మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కేసీఆర్ భేటీ కావడం, ఆయన వెంట ప్రకాష్ రాజ్ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను ఆయన ఖండించలేదు. పైగా ప్రకాష్ రాజ్ తనకు మంచి మిత్రుడని సెక్యులర్ భావాలున్న వ్యక్తని కేసీఆర్ ప్రకటించడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.
ఇక దక్షిణాదిన ప్రకాష్ రాజ్కు మంచి పేరుంది. కర్ణాటక,తమిళనాడులో పలు భాషల్లో నటించిన ఆయన ప్రజలు,రాజకీయ నేతలతో మంచి సంబంధాలు కలిగిఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్రాజ్కు కోఆర్డినేటర్ పోస్టు ఇచ్చి ఫెడరల్ ఫ్రంట్ బాధ్యతల్ని అప్పగించాలని భావిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన గులాబీ ప్లీనరీకి హాజరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.