ప్రపంచ వ్యాప్తంగా భారీ రికార్డులు నమోదు చేస్తూ..సంచలనాలు సృష్టించిన సినిమా ‘బాహుబలి’. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం ఒక్కసారే వస్తుందని, అలాంటి అవకాశం తనకు దక్కిందని, ‘బాహుబలి’ ఇమేజ్ నుంచి బయటకి రావాలని లేదని హీరో ప్రభాస్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను నటించడం నిజంగా ఓ అద్భుతమని, ‘‘బాహుబలి’లో కథానాయకుడిని నేనేనా!’ అని ఒకోసారి ఆశ్చర్యపోతుంటానని తెలిపాడు.
టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తనకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ చిత్రమేనని చెప్పాడు. ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరిస్తారని ఎన్నడూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. ‘బాహుబలి’ విజయం సాధిస్తుందని ఊహించాం కానీ, ఇంతటి విజయం అందుకుంటుందని అనుకోలేదని అన్నాడు. ఈ చిత్రం ఓ అందమైన అనుభూతి లాంటిదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కాగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రభాస్ టీమ్ యూరప్ పర్యటనకు వెళ్లనుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది.