కాంగ్రెస్‌కు సీనియర్ల ముప్పు?

32
- Advertisement -

టీ కాంగ్రెస్ ఈ మద్య మంచి జోష్ లో ఉందనే సంగతి తెలిసిందే. కర్నాటక ఎన్నికల తరువాత కొత్త ఉత్సాహంలో ఉన్న హస్తం పార్టీ ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే కొంత మంది నేతలను కాంగ్రెస్ లో కలిపేసుకున్న హస్తం నేతలు.. ఎన్నికల సమయానికి వీలైనంత వరకు వలస నేతలను ఆహ్వానించాలని చూస్తోంది. ఇదిలా ఉంచితే పార్టీలోని సొంత నేతలు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇస్తూ.. పాత వారిని పక్కన పెడుతున్నారని కొంతమంది సీనియర్ నేతలు ఆవేదనకు లోనౌతున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇటీవల ఎన్నికల కమిటీలో కొంతమంది సభ్యులకు స్థానం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే తనకు స్థానం కల్పించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు టాక్. పార్టీ కోసం నిజాయితీగా పని చేసే తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని, తనపై హైకమాండ్ చిన్న చూపు చూస్తోందని పొన్నం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. దీంతో ఆయన పార్టీ మారనున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Also Read:MP Santhosh:బ్రహ్మకుమారీస్ కల్పతరువు-2 ప్రారంభం

రాబోయే రోజుల్లో తనకు సరైన ప్రదాన్యం అధిష్టానం కల్పించకపోతే పొన్నం పార్టీ మారడం పక్కా అనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంకా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా అధిష్టానం పై గత కొన్నాళ్లుగా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు పార్టీకి సంబంధించిన ఏ కార్యకలాపాలలో యాక్టివ్ గా ఉండడం దాదాపు తగ్గించారు. దీంతో ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ నడుస్తోంది. మరి ఒకవైపు వలస నేతలకు ప్రదాన్యం ఇస్తున్న హస్తం పార్టీ సొంత నేతలను మాత్రం పట్టించుకోకపోవడంతో రాబోయే రోజుల్లో అసంతృప్తి జ్వాలలు మరింత పెల్లుబుక్కే అవకాశం ఉంది. మరి సీనియర్స్ పట్ల హైకమాండ్ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో చూడాలి.

Also Read:ఫోన్‌లో యాప్స్ ఆన్ ఇన్స్టాల్ చేస్తే ఇలా చేయండి!

- Advertisement -