అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో ఇంధన ధరలు క్రమంగా తగ్గుతూవస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబరులో గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ తాజాగా ఈ ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దేశ రాజధాని దిల్లీలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 7 పైసలు తగ్గి రూ. 69.79గా ఉంది. 2018 జనవరి 4న దిల్లీలో లీటర్ పెట్రోల్ అత్యంత తక్కువగా రూ. 69.97 ధరకు అమ్ముడైంది. తాజాగా ఏడాదిలోనే కనిష్ఠానికి తగ్గింది.
ఇక డీజిల్ ధర విషయానికొస్తే.. డీజిల్ కూడా 9 నెలల కనిష్ఠానికి తగ్గిపోయింది. మంగళవారం డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. సోమవారం లీటర్ ధర రూ. 63.83గా ఉంది. ఈ ఏడాది మార్చి తర్వాత డీజిల్ ధర ఇంత తక్కువగా ఉండటం మళ్లీ ఇప్పుడే. ప్రధాన మెట్రో నగరాలైన ముంబయిలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 75.41, కోల్కతాలో రూ. 71.89, చెన్నైలో రూ. 72.41గా ఉంది. ఇక డీజిల్ ధర ముంబయిలో రూ. 66.79, కోల్కతాలో రూ. 65.59, చెన్నైలో రూ. 67.38గా ఉంది.