మోడీ నాకేమన్న అన్నా?.. అమిత్‌ షా బాబాయా?:పవన్

237
nadendla pawan
- Advertisement -

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్‌తో కలిసి జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాతో పవన్ కల్యాణ్ కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.ప్రధాని నరేంద్ర మోడీ నాకేమన్న అన్నా? బీజేపీ చీఫ్ అమిత్‌షా బాబాయా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు నాకు బంధువులు కాదని స్పష్టం చేసిన పవన్… చంద్రబాబు కన్వినెంట్ రాజకీయాలు చేయొద్దని సూచించారు.

నాదెండ్ల రాకతో జనసేన మరింత బలోపేతం అయిందన్నారు పవన్. పార్టీ పెట్టాక తాను మనోహర్ నుంచి సూచనలు, సలహాలు తీసుకునేవాడినని వెల్లడించారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయాన్ని తామిద్దరం కోరుకుంటున్నామనీ, అదే తామిద్దరినీ కలిపిందని వ్యాఖ్యానించారు.

త్వరలో తిత్లీ తుపాన్ ప్రభావీత ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పిన పవన్…సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని వెనక్కి తగ్గినట్లు చెప్పారు. తిత్లీ తుపాన్ బీభత్సం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తుపానుతో కకావికలమైన శ్రీకాకుళంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని జన సైనికులకు పిలుపునిచ్చారు.

ఈ నెల 15న రాజమండ్రిలోని ధవలేశ్వరం బ్యారేజీపై జన సైనికుల కవాతు అనంతరం తొలుత వైజాగ్ కు, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. అక్కడ చేపట్టాల్సిన సహాయక చర్యల వివరాలు తెలుసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తరలివచ్చారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడిగా కాంగ్రెస్‌ పార్టీలో అడుగుపెట్టిన నాదెండ్ల మనోహర్… రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా ఎవరు ఉహించని విధంగా జనసేన లో చేరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌,డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు మనోహర్. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ,ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు.

- Advertisement -