Pawan: పవన్ వెనక్కి తగ్గినట్లేనా?

25
- Advertisement -

టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై ఇద్దరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ 32 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు డిమాండ్ చేయగా ఇందులో 20 సీట్ల విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మరో ఐదు సీట్లను అదనంగా జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారట. దీంతో పవన్ కూడా కాస్త వెనక్కి తగ్గి టీడీపీ కేటాయించిన సీట్లతో సర్దుబాటు జరుపుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం కోసం పవన్ చంద్రబాబు ఈ నెల 8న మరోసారి భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. .

ఆ రోజున జరిగే సమావేశం తర్వాత ఇరు పార్టీల నుంచి సీట్ల ప్రకటన అలాగే పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లు అన్నిటిపై కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సీట్ల ప్రకటన తరువాత తదుపరి కార్యక్రమాలపై ఇరు పార్టీలు దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే ప్రకటించి ఆ తరువాత పూర్తి స్థాయిలో ప్రచారం పై దృష్టి పెట్టేలా అధినేతలు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఇకపై నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా టీడీపీ జనసేన పార్టీలు కలిసి నిర్వహించేలా వ్యూహాలు రచిస్తున్నారట. అటువైపు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేస్తూ ప్రచారంలో వేగంగా దూసుకుపోతున్నారు. అందుకే ఇకపై ఆలస్యం చేయకుండా సీట్ల పంచాయతీ కి చెక్ పెట్టాలని పవన్ చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీట్ల ప్రకటన తర్వాత ఇరు పార్టీలలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:బాలీవుడ్ హీరోతో శ్రుతి హాసన్?

- Advertisement -