పవన్ కల్యాణ్ నటించిన మొదటిసినిమా అన్న వెంటనే అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. అయితే అందరూ అనుకున్నట్టు ఆ సినిమా కాదని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య కళా తపస్వి కె.విశ్వనాథ్ కు సినీ రంగంలో అత్యుత్తమ పురస్కారమైన దాదాపాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆయన్ను కలిసేందుకు వెళ్లారు పవన్ కల్యాణ్.. దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరూ కలిసి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. అయితే.. కె.విశ్వనాథ్ పై తనకున్న అపార ప్రేమాభిమానాల్ని తన మాటలతో చెప్పి అందరి మనసుల్ని దోచుకున్నాడు పవన్ కల్యాణ్. తనకు నటన రాదని.. అందుకే కె. విశ్వనాథ్ సినిమాల్లో నటించలేదంటూ తనలోని లోపాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసిన పవన్ తీరు పలువురిని ఆకట్టుకుంది. అంతేకాదు ఇప్పటివరకూ ఎవరికి తెలీని ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తనకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చింది కె.విశ్వనాథ్ సినిమాలోనే అంటూ ఆయన చెప్పారు.
“మద్రాసు టీ నగర్, పోరూరు సోమసుందరం వీధిలో అన్నయ్య వాళ్ల ఇల్లు ఉండేదని అందరికీ తెలుసుగా. దానికి ఎదురుగానే విజయనిర్మల గారి ఇల్లు ఉండేది. ఆ పక్క సందులోనే వాళ్ల డబ్బింగ్ థియేటర్ ఉంది. అందులో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అన్నయ్య తొలిసారిగా నటించిన ‘శుభలేఖ’ సినిమా డబ్బింగ్ జరుగుతోంది. అప్పట్లో నాకు పదహారేళ్ళు ఉంటాయనుకుంటా. చదువుకుంటున్నా. ఇంటి పక్కనే కదా అని అన్నయ్యకు టీ ఇవ్వడానికి డబ్బింగ్ థియేటర్ కి వెళ్లాను. ఆ సినిమాలో అన్నయ్య సర్వర్ గా పనిచేసే పాత్రలో నటించారు. ఏదో హోటల్ సీన్ కు డబ్బింగ్ జరుగుతూ ఉన్న సమయంలో నేను వెళ్లాను. నన్ను చూసిన, ఆ సినిమా నిర్మాత వి.వి.శాస్త్రి, ‘ఈ డబ్బింగ్ చెప్పరా’ అంటూ ‘మంచినీళ్ళు ఎక్కడ సార్?’ అనే చిన్న డైలాగ్ ఇచ్చారు. నేనూ చెప్పేశాను. ఇప్పటికీ ‘శుభలేఖ’ సినిమాలో నా గొంతులో ఆ డైలాగ్ వినచ్చు. అదే నా తొలి పరిచయం. ఒక రకంగా చెప్పాలంటే, విశ్వనాథ్ గారి సినిమాతోనే నా రంగప్రవేశం జరిగిందనుకోవచ్చు” అంటూ పవన్ వెల్లడించారు.