TTD:రూ.38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణ

24
- Advertisement -

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు రూ.33 ల‌క్ష‌లు ఉండ‌గా, పెరిగిన ధ‌ర‌ల నేప‌థ్యంలో టీటీడీ రూ.38 ల‌క్ష‌లకు పెంచింది.

ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.

Also Read:రవితేజతో కోలీవుడ్ స్టార్!

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

- Advertisement -