మే 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది ఈసీ. మే 19 వరకు ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లలో మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. పత్రికలు, వార్త ఛానెళ్లతో పాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సైతం ప్రకటించకూడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ ఎన్నికలు ముగియగా చివరిదశ 19 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి.
ఇక ఏపీలో పలుచోట్ల విధ్వంసం జరిగిన నేపథ్యంలో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపామని ఏపీ ఈసీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 244 నంబరు పోలింగ్ కేంద్రం, నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ నంబరు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపాదనలు అందాయన్నారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టే వరకు ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. సీఆర్పీఎఫ్ సాయుధ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది మధ్య మూడంచెల కట్టుదిట్టుమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

