కోడిగుడ్లతో క్యాన్సర్‌ ప్రమాదం లేదు!

4
- Advertisement -

గుడ్లను తినడం వల్ల క్యాన్సర్‌ వస్తుందన్న ఆరోపణలను తప్పుదోవ పట్టించేవి, శాస్త్రీయ ఆధారాలు లేనివిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఖండించింది. నిబంధనల ప్రకారం ఉత్పత్తి చేసిన గుడ్లు పూర్తిగా సురక్షితమైనవి, పోషక విలువలతో కూడినవి అని వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఇటీవల గుడ్లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నాయన్న ఆందోళనల నేపథ్యంలో, దేశంలో లభ్యమవుతున్న గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమేనని FSSAI శనివారం స్పష్టంగా ప్రకటించింది.కాలుష్యంపై వచ్చిన ఆరోపణలను “శాస్త్రీయ ఆధారాలు లేని, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే ప్రకటనలు”గా నియంత్రణ సంస్థ పేర్కొంది.

ఇటీవల కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్‌ (AOZ) అనే క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశాయి.దీనిపై స్పందించిన FSSAI అధికారులు, పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి అన్ని దశల్లో నైట్రోఫ్యూరాన్ల వినియోగం పూర్తిగా నిషేధితమని, 2011 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (కాలుష్యాలు, విషాలు, అవశేషాలు) నిబంధనల ప్రకారం స్పష్టం చేశారు.

నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్‌కు కిలోకు 1.0 మైక్రోగ్రామ్‌గా నిర్ణయించిన ఎక్స్‌ట్రేనియస్ మాక్సిమమ్ రెసిడ్యూ లిమిట్ (EMRL) అనేది కేవలం నియంత్రణ, అమలు కోసం మాత్రమేనని, ఆధునిక ల్యాబ్ పరీక్షల్లో గుర్తించగల కనిష్ట స్థాయిని సూచిస్తుందే తప్ప, ఆ పదార్థం వినియోగానికి అనుమతి ఉందని అర్థం కాదని తెలిపారు. EMRL కంటే తక్కువ స్థాయిలో అవశేషాలు గుర్తించబడితే, అది ఆహార భద్రత ఉల్లంఘన కాదని, ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు పేర్కొన్నారు.

భారతదేశంలోని ఆహార భద్రతా నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని FSSAI తెలిపింది. యూరోపియన్ యూనియన్‌, అమెరికా కూడా ఆహార ఉత్పత్తి జంతువుల్లో నైట్రోఫ్యూరాన్ల వినియోగాన్ని నిషేధించాయని, అక్కడ కూడా నియంత్రణ కోసం మాత్రమే కొన్ని మార్గదర్శక స్థాయిలు ఉంటాయని వివరించింది. దేశాల మధ్య సంఖ్యల్లో తేడాలు ఉండటం వినియోగదారుల భద్రతలో తేడాలు ఉన్నాయన్న అర్థం కాదని స్పష్టం చేసింది.

Also Read:KTR:రేవంత్, రాహుల్..’ఐరన్ లెగ్’

ప్రజారోగ్యంపై స్పందించిన FSSAI, నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్‌ను అతి తక్కువ స్థాయిలో ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయన్న శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది. సాధారణంగా గుడ్లు తినడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుందన్న సంబంధాన్ని ఏ జాతీయ లేదా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించలేదని స్పష్టం చేసింది.ఒక నిర్దిష్ట గుడ్ల బ్రాండ్‌పై జరిగిన పరీక్షలకు సంబంధించి వచ్చిన నివేదికలు ఒక బ్యాచ్‌కు మాత్రమే పరిమితమైనవి కావచ్చని, అవి అనుకోకుండా జరిగిన కాలుష్యం లేదా మేత కారణాల వల్ల రావచ్చని, దేశవ్యాప్తంగా గుడ్ల సరఫరా వ్యవస్థను ప్రతిబింబించవని అధికారులు తెలిపారు.

- Advertisement -