సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేయాలి..

177
- Advertisement -

సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్ లను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్, ముంబయి, కోల్ కతాలలో ప్రాంతీయ బెంచెస్ లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఎల్బీ నగర్ లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ” నీడ్ ఆఫ్ రీజనల్ సుప్రీం కోర్టు బెంచెస్ ఇన్ ఇండియా ” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్యులకు సుప్రీం కోర్టు అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ప్రజలకు సుప్రీం కోర్టు సేవలు అందుబాటులో ఉండాలంటే ప్రాంతీయ బెంచెస్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం అని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు, హైకోర్టులలో జడ్జీల నియామకాలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ వర్గాలకు జడ్జీల నియామకాలలో తీరని అన్యాయం జరుగుతూనే ఉందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఒక్క ఎస్టీ జడ్జీ కూడా లేరని అన్నారు.

దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కేసులు వివిధ కోర్టులలో పెండింగులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని హైకోర్టులలో 44 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని, సుప్రీం కోర్టులో 59, 211 కేసులు పెండింగులో ఉన్నాయని, దేశ వ్యాప్తంగా జిల్లా, సబార్డినెట్ కోర్టులలో 3 కోట్ల 10 లక్షల 72 వేల కేసులు పెండింగులో ఉన్నాయని వినోద్ కుమార్ వివరించారు. దేశ జనాభాకు అనుగుణంగా జడ్జీల సంఖ్య లేదన్నారు.

ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్, తమిళనాడు రాష్ట్ర మాజీ ఎంపీ ఖరువెంతన్, తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి కళ్యాణ్, ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, హెడ్ వెంకటేశ్వర్లు, మహాత్మా గాంధీ లా కాలేజ్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -