వాట్సాప్ వినియోగదారుల గోప్యత, అనుమతి అంశాలపై తమ ఆదేశాలు ప్రకటనలతో పాటు ప్రకటనేతర ప్రయోజనాలకూ వర్తిస్తాయని జాతీయ కంపెనీ చట్ట అప్పీల్ ట్రిబ్యునల్ (NCLAT) సోమవారం స్పష్టం చేసింది. వాట్సాప్ యూజర్ డేటా సేకరణ, పంచుకోవడంపై వినియోగదారుల స్పష్టమైన మరియు తిరిగి ఉపసంహరించుకునే అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.
ఈ విషయంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ సీసీఐ (CCI) దాఖలు చేసిన దరఖాస్తును విచారించిన ఎన్సీఎల్ఏటీ…వాట్సాప్ మరియు మెటా సంస్థలు వినియోగదారుల డేటాపై ఏకపక్షంగా లేదా పరిమితిలేని హక్కులు కోరలేవు అని తేల్చింది. ఏ డేటా సేకరించాలి, ఏ ప్రయోజనం కోసం, ఎంతకాలం పాటు అనే విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు వినియోగదారులకే ఉంటుంది. ప్రకటనల వంటి అవసరం లేని డేటా వినియోగం యూజర్ అనుమతితోనే జరగాలి అని ట్రిబ్యునల్ పేర్కొంది.
వినియోగదారులకు ఎప్పుడైనా డేటా షేరింగ్కు opt-in లేదా opt-out ఎంపిక ఇస్తే, వారి హక్కులు అన్ని దశల్లో రక్షించబడతాయని, 2021 వాట్సాప్ పాలసీలో ఉన్న దోపిడీ పరిస్థితులు తొలగిపోతాయని ఎన్సీఎల్ఏటీ వ్యాఖ్యానించింది.ఈ మేరకు 2024 నవంబర్ 18న సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులోని పారా 247.2.1 నుంచి 247.2.4 వరకు ఉన్న దిశానిర్దేశాలు, ప్రకటనలతో పాటు ప్రకటనేతర ప్రయోజనాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. న్యాయమూర్తి అశోక్ భూషణ్ (చైర్పర్సన్), అరుణ్ బరోకా సభ్యులుగా ఉన్న బెంచ్, ఈ మార్పులు అమలు చేసేందుకు వాట్సాప్కు మూడు నెలల గడువు ఇచ్చింది.
Also Read:నేషనల్ హెరాల్డ్ కేసు..సోనియా,రాహుల్కు రిలీఫ్

