OU..ఇంజనీరింగ్ కాలేజ్‌కు జాతీయ గుర్తింపు

8
- Advertisement -

ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. విద్య, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల్లో చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మక ‘IEEE ఇండియా కౌన్సిల్ అవుట్‌ స్టాండింగ్ ఎమర్జింగ్ స్టూడెంట్ బ్రాంచ్’ అవార్డు – 2025 దక్కింది. IEEE స్టూడెంట్ బ్రాంచ్ కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన, నిరంతర సాంకేతిక కార్యక్రమాలు మరియు విద్యార్థులను క్రియాశీలకంగా భాగస్వామ్యం చేసినందుకు గాను ఈ పురస్కారానికి ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ఎంపికైంది. ఐఐటి బెంగళూరులో జరిగిన IEEE ఇండియా కౌన్సిల్ వార్షిక ఫ్లాగ్‌షిప్ కాన్ఫరెన్స్ ‘IEEE INDICON 2025’ లో IEEE ఇండియా కౌన్సిల్ చైర్ ప్రొఫెసర్ ప్రేరణా గౌర్ చేతుల మీదుగా…. ఉస్మానియా యూనివర్సిటీ తరపున IEEE స్టూడెంట్ బ్రాంచ్ కౌన్సిలర్ ప్రొఫెసర్ జి. మల్లేశం, స్టూడెంట్ బ్రాంచ్ చైర్ (2024–2025) నితిన్ నరసింహ వడ్ల ఈ అవార్డును అందుకున్నారు. ఓయూ అధ్యాపకుడిగా, విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఈ అవార్డు అందుకోవటం ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశం అభిప్రాయపడ్డారు.

ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కటం పట్ల ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం… అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, వృత్తిపరమైన నైపుణ్యంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా ఓయూ ఖ్యాతి దశదిశలా విస్తరించాలని… ఇందుకు భాగస్వాములమంతా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయి గుర్తింపు దక్కటంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జి. మల్లేశం మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు, అధ్యాపకులు కొనియాడారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మంగు ల పర్యవేక్షణ, నిరంతర సహకారంతో ఇంజినీరింగ్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని అన్నారు. కోర్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకుల అంకితభావంతో కూడిన టీమ్ వర్క్ వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కటం సాంకేతికంగా సమర్థులైన, సామాజిక బాధ్యత గల ఇంజనీర్లను తీర్చిదిద్దడంలో ఉస్మానియా యూనివర్సిటీ అగ్రగామిగా ఉందని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితెంద్రకుమార్ నాయక్ లు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:PAK:ఇమ్రాన్‌ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -