ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించి పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పుచేశారన్నారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ వైపు చూస్తే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్కు ఓటేసింది. ఆ ఓట్లు ఏమయ్యాయి.. మురిగిపోయి.. మురుగు కాల్వలో కలిసిపోయాయని తెలిపారు. కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్లు ఇప్పుడు కుమిలిపోతున్నారని తెలిపిన తుమ్మల గత పొరపాటు పునరావృతమైతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నామా నాగేశ్వరరావు తన మనిషిగా వచ్చారని, ఆయన్ను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని అన్నారు.
భక్తరామదాసు ప్రాజెక్ట్తో పాలేరులో 360 చెరువులు నింపి పచ్చని పంటలు పండించేలా కృషి చేశానని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా..అభివృద్ధి చేసినా తనను ఓడించటం బాధ కలిగించిందని అన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.
పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే సీఎం కేసీఆర్ ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకోవడం ద్వారా ఆ బాధను తీర్చాలన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి .16 మంది ఎంపీలు గెలిస్తే దేశ రాజకీయాల్లో సీఎం కేసీర్ ఎదురులేని శక్తిగా ఉంటారని చెప్పారు.