సాగర్‌లో కారు స్పీడ్..కమలంలో కంగారు..!

189
trs
- Advertisement -

నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేయడంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే సాగర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న 7గురు ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రకటించకుండానే తమకు కేటాయించిన మండలాలలో ఇంటింటికి తిరుగుతూ… ఓటర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, స్థానికంగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డిలు రంగంలోకి దిగారు.

నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో ఆలోచన రేకిత్తిస్తున్నారు. తాజాగా బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నోముల భగత్‌కు మద్దతు తెలుపుతూ.. వేరు వేరు ప్రాంతాల్లో, ఉమ్మడిగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డిలు ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో అన్ని మతాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తుందని. మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని, కానీ, కొన్ని పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలనే కుట్రలు చేస్తున్నాయని బీజేపీపై హోంమంత్రి మహమూద్ అలీ విరుచుకుపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచినట్టే మతాన్ని అడ్డుపెట్టుకొని గెలుపొందాలని చూస్తున్నారు. ప్రజలు వారి మాటలను నమ్మొద్దు అంటూ బండి సంజయ్‌ను ఉతికారేసారు. హాలియా పట్టణంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తా అంటూ ముస్లింమైనారిటీలకు మంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చారు. ఇక మరో మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

నియోజకవర్గానికి జానారెడ్డి ఏమి చేశారని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ప్రజల అమాయకత్వంతో వరుసగా ఏడుసార్లు గెలిచిన జానా.. కనీసం సాగర్ మొదటి మేజర్‌కు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు.. 40 ఏండ్లుగా త్రాగు, సాగునీరు లేక సాగర్ నియోజకవర్గం ఎడారిగా మారింది. కానీ, సాగర్ ఎడమ కాలువ కింది చివరి భూములకు కూడా సమృద్ధిగా రెండు పంటలకు నీళ్లు అందించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదే అని ప్రజలకు వివరించారు. దురదృష్టవశాత్తు నోముల నరసింహ్మయ్య అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. నోముల నర్సింహ్మయ్య 5 ఏండ్లు అధికారంలో ఉండాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారు. అదే ఆకాంక్ష కొనసాగాలని సీఎం కేసీఆర్ నోముల భగత్‌ను పోటీలోకి దించారు. ఈ ఎన్నికల్లో విజయం అధికార పార్టీదే అని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక మరో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. జానా రెడ్డి వద్దు.. నోముల భగత్ ముద్దు అంటూ సాగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జానారెడ్డికి చేతకాకపోతే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.. అంతేకానీ ఎన్నికల ప్రచారం వద్దనడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధిని తెలియపరచాలి. ఇదే సమయంలో ఓటు వేయమని అభ్యర్థించడమే అభ్యర్థి లక్షణం. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భగత్ కుమార్ విద్యావంతుడు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడు. జానారెడ్డి వృద్దుడు. శక్తి సామర్థ్యాలు తగ్గాయి.. పరిపాలన అందించలేరు అంటూ చురకలు అంటించారు. మొత్తంగా సాగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయనే చెప్పాలి.

- Advertisement -