గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నాబార్డ్ చేయూత…

182
ktr
- Advertisement -

గ్రామీణ ప్రాంత అర్ధిక వ్యవస్ధ బలోపేతానికి, గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న (పెట్టుబడుల అవకాశాల బలోపేతానికి) ఇతర గ్రామీణ రుణ వ్యవస్థ బలోపేతానికి నాబార్డ్ పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈరోజు నాబార్ద్ సిజియం వై.కె రావు తో ప్రగతి భవన్ లో మంత్రి కె. తారక రామారావు సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామి గా ఉండేందుకు నాబార్డ్ కున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్న సాగునీటి ద్వారా ప్రస్తుతం వస్తున్న వ్యవసాయోత్పత్తుల విప్లవం వలన ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటి ఏర్పాటు కోసం నాబార్డ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు వీలు కలుగుతుందని, తద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ ప్రాతిపదిక పైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ బుణ సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సిజియంను కోరారు. ఇప్పటికే నాబార్డ్ పాడి పశువుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా అనేక రుణాలు ఇస్తుందని, అయితే ఏదైనా ఒక జిల్లాలో సంతృప్త స్థాయి (సాచ్యురేషణ్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ఇందుకోసం తన సొంత జిల్లా సిరిసిల్లలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా గ్రామాల్లోని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా సుమారు రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్ద్యం గల 500 గొడౌన్లను నిర్మించేందుకు చేస్తున్న తమ ప్రయత్నాలకు సహకారం అందించాలని కోరారు. దీంతోపాటు గ్రామాల్లోని రైతు బందు కమిటీలను మరింతగా ఫెడరేట్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి అవసరమైన రుణాలను రుణ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి చేపడుతున్న అనేక కార్యక్రమాలు తమ బ్యాంకు లక్ష్యాలకు, స్పూర్తికి అనుగుణంగా ఉన్నాయని నాబార్డు సీజీఎం వై.కె రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచించిన సూచనలకు సానుకూలంగా స్పందించిన సి జి యం, తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు,రైతు బంధు సమితి చైర్మన్ పళ్ళ రాజేశ్వర రెడ్డి మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -