వనజీవి రామయ్య ఆరోగ్య బాధ్యత తనదే: సంతోష్

79
mp
- Advertisement -

అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య ప్రగతి భవన్ లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందంనం చేసి సంతోష్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు.

ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని రామయ్య అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు.

ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య దంపతులను కలవటం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిపై సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు ఎంపీ సంసిద్దత తెలిపారు.

- Advertisement -