మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదంలో సీఎం కేసీఆర్ పాత్ర కీలకమన్నారు ఎమ్మెల్సీ కవిత. లండన్లో పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధాన మంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారని వివరించారు. 1950లో రాజ్యాంగ చర్చలు జరుగుతున్న సందర్భంలో తాము కూడా పురుషులతో సమానంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందున రాజకీయ రంగంలో తాము రాణిస్తామని, కాబట్టి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అవసరం లేదని సరోజినీ నాయుడు వంటి వారు వాదించారని గుర్తు చేశారు.
స్టార్టప్ల విషయంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. 10 స్టార్టప్ కంపెనీలు ఏర్పడితే మహిళా నేతృత్వంలో కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటున్నాయని తెలిపారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు ఆర్థిక సాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితకు లండన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
Also Read:మహిళలల్లో మధుమేహం.. చాలా ప్రమాదం!