Kavitha:కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి

19
- Advertisement -

కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ లోని తన నివాసంలో మాట్లాడిన కవిత..కొన్ని వర్గాల ఓట్ల కోసం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడడం, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ హేళన చేయడం, వలస కార్మికులను అవమానించడం వంటివి చేస్తున్నా ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెబుకుంటున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర అన్నది కేవలం ప్రచారం కోసమే అన్నది తేలిపోయిందని స్పష్టం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా సనాతన ధర్మాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్ గా తీసుకొని రాహుల్ గాంధీ స్పందించి ఉంటే పదేపదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ ఎన్నికల గాంధీ అని పిలుస్తారని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల పట్ల గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకి కాదని రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులంటే ప్రగతిలో భాగస్వాములని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గారు అన్నారని, కార్మికుల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి గౌరవమర్యాదలేవీ లేవని ధ్వజమెత్తారు.

కర్నాటకలో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ… ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆరోపించారు. హామీలను అమలు చేసి చూపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో గ్యారెంటీల పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని ప్రస్తావించారు. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిషేధం ఎత్తివేతపై వెనుకాడుతోందని తప్పుబట్టారు. హిజాబ్ విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పింది చేయకపోవడం కాంగ్రెస్ డీఎన్ఏ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని ధ్వజమెత్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై స్పందిస్తూ… రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 20 రోజులే అవుతోందని, ఎన్నికల ఫలితాలపై తాము మదింపు చేస్తున్నామని అన్నారు. కాబట్టి ప్రభుత్వానికి మరికొద్ది రోజుల పాటు సమయం ఇవ్వాలని, ఆ తర్వాత పరిస్థితిని చూద్దామని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చుతుందని ఆశిస్తున్నామని, తగిన సమయంలోగా హామీలను అమలు చేయకపోతే తాము కచ్చితంగా ప్రశ్నిస్తామని తెలిపారు.

Also Read:షారుఖ్ రికార్డులే ‘ సలార్ ‘ టార్గెట్?

- Advertisement -