కవిత ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన ఎమ్మెల్సీలు..

182
- Advertisement -

జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి వినతి పత్రం అందజేశారు.

జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీలు చర్చించారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు సంబంధించి 16 అంశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో చర్చించామన్న ఎమ్మెల్సీ భానుప్రసాద్, వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామి ఇచ్చారని పేర్కొన్నారు. అంతే కాదు త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలందరం ఇదే అంశాలపై సీఎం కేసీఆర్‌ను కలుస్తామని, అంతేగాక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసి పార్టీ పరంగా మద్దతు కోరతామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారిపోయాయన్న ఎమ్మెల్సీలు, గ్రామాలు అన్ని రంగాల్లో ఎంతో పురోగతిని సాధించాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుభీమా , కల్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్స్ , తదితర కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలోపేతం అయిందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, టి. భాను ప్రసాద్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి. భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుల్ల దామోదర్ రెడ్డి, తేరా చిన్నప రెడ్డి, పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

mlc kavitha

- Advertisement -