బీజేపీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరు- కవిత

122
kavitha
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేడు గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పలువురు పార్టీ నాయకులు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, బాణసంచాలతో ఎమ్మెల్సీ కవితకు టీఆర్ఎస్ ‌కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ముందుగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలలో అనుసరించే వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై చర్చ జరిగింది. తరువాత గాంధీనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌తో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని.. గాంధీనగర్‌ డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు చేశామని కవిత అన్నారు. గత ఎన్నికల్లో 6వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గాంధీనగర్‌ డివిజన్‌ను గెలుచుకున్నాం. ఐదేళ్లలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. బీజేపీ అబద్దాలు చెప్పి గెలిచే కాలం చెల్లింది. కరోనా వచ్చినప్పుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ ముఠా పద్మ ప్రజల మధ్యలో ఉన్నారు. బీజేపీ నేత లక్ష్మణ్‌ ఇంత వరకు అడ్రస్‌ లేరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది. వరదలతో నష్టపోయిన వారిని సీఎం కేసీఆర్‌ ఆదుకున్నారు. బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని’ కవిత పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీనేతలకు సూచించారు.

- Advertisement -