ముళ్లబాటలో సీతక్క..నక్సలైట్‌ నుంచి మంత్రిగా పయనం

49
- Advertisement -

ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క గురించి తెలియని వారు ఉండరు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె తెలుగు రాష్టాల్ర ప్రజలకు సుపరిచితమే. ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ప్రత్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఆ తర్వాత దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం విూద పోరాటం చేశారు. అక్కడ మారిన సిద్దాంతాలు పొసగక బయటికి వచ్చారు. సాయుధ పోరాటాల కంటే ప్రజల్లో ఉండి పోరాడటమే మేలనుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. రాజకీయాల్లో చేరడానికి ముందు 15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకు న్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

నక్సలైట్‌ జీవితం నుంచి లాయర్‌గా.. ఆపై ఎమ్మెల్యేగా… ఆ తర్వాత ప్రజాదరణ పొందిన నాయకురాలిగా గుర్తింపుతెచ్చుకున్న సీతక్క ఇప్పుడు.. కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగిరారు. ముళ్ల బాటలను దాటుకుండా.. ప్రజాసేవకు సరైన మార్గం ఎన్నుకుంటూ… ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తుపాకీ తూట కంటే అంబేడ్కర్‌ బాటలో పయనిస్తే ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని భావించారు. గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూ సామజికసేవ వైపు పయనం సాగించారు సీతక్క. ఆపై రాజకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్స్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలుగుదేశంలో చేరి ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. సొంత నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రజల పక్షాన పోరాడారు.

ఇటు రాజకీయాల్లో, అటు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా నక్సలైట్‌ జీవితం నుంచి.. ఇప్పుడు మంత్రిగా ఎదిగారు సీతక్క. ములుగు నియోజకవర్గంలో ఆమె ప్రజలకు ఎంతగా చేరువయ్యారో ఆమె చేసిన సేవలే నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఆమె గరిజనులకు అండగా నిలిచారు. 1971, జూలై 9న.. వరంగల్‌ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క`సమ్మయ్య దంపతులకు జన్మించారు సీతక్క. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో చదువుకుంటున్న సమయంలోనే పోరాటంలోకి వెళ్లారు సీతక్క. గిరిజన వసతి గృహంలో సరిగా భోజనం పెట్టడం లేదని, బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేశారు.. అప్పుడు ఆమె వయస్సు 13ఏళ్లు. ఆమె పోరాటపటిమను గుర్తించిన పీపుల్స్‌ వార్‌ దళం సభ్యుల పిలుపుతో…14ఏళ్ల వయస్సులోనే అడవిబాట పట్టారు. 1988లో 10వ తరగతి చదువుతుండగానే నక్సల్స్‌ పార్టీలో చేరారు. మావోయిస్టుల్లో చేరినా చదువు వదల్లేదు సతీక్క. పోలీసుల అరెస్ట్‌ చేసినా… జైల్లో ఉంటూనే పదో తరగతిలో ఫెయిల్‌ అయిన స్జబెక్టులకు పరీక్షల రాసి పాస్‌ అయ్యారు. ఆ తర్వాత… ప్రేమించిన తన బావనే పెళ్లాడారు సీతక్క. రెండు నెలల కుమారుడిని వేరేవాళ్ల చేతుల్లో పెట్టి మళ్లీ అడవిబాట పట్టారు.

జన నాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 20ఏళ్ల పాటు నక్సలైట్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు సీతక్క. ఆ తర్వాత సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం.. దళంలో మారిన సిద్దాంతాలు నచ్చక 1996లో బయటికి వచ్చేశారు సీతక్క. ఆ తరువాత ఐటిడీఏలో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు. ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క.. 2001లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తొలిసారిగా ములుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి ములుగు నుంచి గెలుపొందారు సీతక్క. కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితమైతే.. ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరుగుతూ ఎంతో మందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతులపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌ కూడా పొందారు.

Also Read:మంత్రులు – శాఖల వివరాలు

- Advertisement -