గురుకుల విద్యను మరింత బలోపేతం చేయాలి

430
Satyavathi
- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక గురుకుల విద్యను ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అధికారులకు సూచించారు. నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా ఝడ్ చోంగ్తు, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు, ఇతర అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సమీక్ష చేశారు.

ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూ..  గురుకులాలకు వచ్చే విద్యార్థులకు ఖచ్చితంగా మంచి భవిష్యత్ అందే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మన గురుకులాలను పటిష్టం చేసేందుకు అడిగిన వసతులన్నీ కల్పిస్తున్నారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మన విద్యా విధానం కూడా అదే స్థాయిలో ఉండేటట్లు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.  గురుకులాలు సమర్థవంతంగా పనిచేసేలా, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు వీటి పనితీరును పర్యవేక్షించేలా, ఆకస్మిక తనిఖీలు చేసేలా వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు.అదేవిధంగా విద్యార్థులకు అందించే భోజనంలో మెనునూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏ పరిస్థితుల్లోనూ మెనును పాటించని అధికారులు, సిబ్బందిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

    ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో బాలికల గురుకుల విద్యాలయాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాలికల విద్యాలయాల్లో పురుష సిబ్బంది, ఉద్యోగులు లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లు ఉన్న పోలీస్ పరిధిలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేక క్లాసులు నిర్వహించడంతో పాటు సిబ్బంది, అధికారులను జవాబుదారితనం చేసే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -