సమీకృత కలెక్టరేట్ భవనాలు వెంటనే పూర్తి చేయాలి-ప్రశాంత్ రెడ్డి

229
prashanth rreddy
- Advertisement -

నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణ పురోగతిపై ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ముంగిటకే పాలన వెళ్లాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ లో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణ లో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణ గా చేశారు.

అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే గొడుగు కింద అందాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు.21 కొత్త జిల్లాల,5 పాత జిల్లాలు మొత్తం 26 జిల్లాల్లో నూతన కలెక్టరేట్ కార్యాలయాలు ఒక్కోటి దాదాపు ఒక లక్ష 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభమై పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ ఇంటి గ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు అక్కడి నుండే పనిచేసే విధంగా.. ప్రజలు వారి పనుల నిమిత్తం కాళ్ళు అరిగేలా అక్కడా, ఇక్కడా తిరగకుండా ఒకే చోట వారి పనులు పూర్తి చేసుకునేలా ఈ కార్యాలయాలు పనిచేయనున్నాయి”అని మంత్రి అన్నారు.

సిద్ధిపేట కలెక్టరేట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించే అవకాశం ఉన్నందున ఈనెల 15 లోపు అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.నిజామాబాద్, కామారెడ్డి,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి,వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి కాబట్టి ఈనెల 28 లోపు ప్రారంభించుకోవడానికి సిద్ధం చేయాలన్నారు.

వరంగల్ అర్బన్,జనగాం, రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్లు దసరా నాటికి పూర్తి చేసి ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు.మిగతా కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో వేగం పంచాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు,సి.ఈ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -