ముమ్మాటికీ ఇది రైతు ప్రభుత్వం- మంత్రి నిరంజన్ రెడ్డి

89
Niranjan Reddy
- Advertisement -

తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి రాజ్యసభ సాక్షిగా వెల్లడయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉన్నదని రాజ్యసభలో సభ్యుడి ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చిందని మంత్రి తెలిపారు. 2020-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 2019-20 ఖరీఫ్ సీజన్లో 111.26 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ నుండి సేకరించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమయిందిని మంత్రి పేర్కొన్నారు.

ఆకలిదప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పన, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఏటా 25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు వంటి పథకాలకు దాదాపు 60 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం మారాలంటే 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం బలపడాలన్న ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికబద్దంగా ముందుకెళ్లడంతో ఇది సాధ్యమయిందన్నారు.

రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ప్రపంచంలో రైతులకు అండగా నిలుస్తున్నది తెలంగాణ రాష్ట్రం. దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్తులోనూ రైతు నష్టపోకూడదు, ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న రెక్కల కష్టానికి ఫలితం దక్కాలని వంద శాతం పంటలను సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముమ్మాటికీ ఇది రైతు ప్రభుత్వం.. వ్యవసాయ రంగం మరింత బలోపేతం చేయడంతో పాటు, రైతు పంటకు తగిన మద్దతు ధర దక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతాం.మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ప్రత్యేకంగా మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను నెలకొల్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

- Advertisement -