వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు..

96
minister niranjan reddy
- Advertisement -

నిర్మల్‌ జిల్లా అంబేద్కర్ భ‌వ‌న్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత- అవ‌గాహ‌న‌ సదస్సు లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు, విఠల్ రెడ్డి ,రేఖా శ్యాంనాయ‌క్, రాథోడ్ బాపురావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, క‌లెక్టర్ ముశ్ర‌ఫ్ ఫారూఖీ అలీ, నిర్మ‌ల్ జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు, రైతులు, వ్య‌వసాయ, ఇత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భగవత్ స్వరూపుడు..వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు అన్నారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే ఉంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు. వ్యవసాయానికి నిర్మల్ ప్రాంతం పెట్టింది పేరు. ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు ఎంతో సారూప్యత ఉంది. పత్తి పంటకు ఈసారి మద్దతుధరకు మించి రెట్టింపుగా రూ.12 వేల వరకు ధర పలికింది.. వేరుశెనగ మద్దతుధరకు మించి రూ.9,10 వేల వరకు ధర పలికిందని తెలిపారు.

రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలి. పత్తి సాగులో రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా రశీదు తీసుకోవాలని మంత్రి సూచించారు. భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడొద్దు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు, రసాయనాలను ఉపయోగించాలి. ఎకరాకు 40 కిలోలకు మించి ఎంత యూరియా వేసినా అది వృధానే.. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృతంగా ఎరువులు, రసాయనాల వాడకంపై అవగాహన కల్పించాలి. రైతులకు ఒకసారి అవగాహన వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వాడి భూమిలో సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.

వ్యవసాయాన్ని లాభసాటి చేయడం అంటే పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడం, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం, పంటల దిగుబడి పెంచుకోవడం ద్వారా వ్యవసాయం లాభదాయకం అవుతుంది. రైతులు స్వంత గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలు, మండలాలు, జిల్లాలు పర్యటించి రైతుల విజయాలను గమనించాలి.బియ్యం, కందిపప్పు తర్వాత మినుముల వినియోగం దేశంలో అత్యధికంగా ఉంది .. రైతులు దీని సాగుపై దృష్టి సారించాలి. తెలంగాణ రైతుల ధాన్యం కొనలేక కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సాహసంతో కొనుగోలుకు ముందుకువచ్చారు అని మంత్రి తెలిపారు.

పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలి. తెలంగాణలో ఈ ఏడాది 2 నుండి 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్.. అందుకే దీనిని ప్రోత్సహిస్తున్నాం అన్నారు. పంటనాటిన తర్వాత నాలుగేళ్ల వరకు గొర్రెల పెంపకంతో పాటు, అనేక అంతర పంటలు సాగుచేయొచ్చు అని మంత్రి తెలిపారు. ఏఈఓలతో క్షేత్రస్థాయిలో సమస్యలు, పంటల సాగు, రైతులతో అనుభవాలు, ప్రధాన పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, 2014 కు ముందు 2014 తర్వాత తెలంగాణ వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు మంత్రులు.

- Advertisement -