బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి నిరంజన్ రెడ్డి..!

85
bandi sanjay niranjan reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

“తెలంగాణ రైతాంగం పట్ల బీజేపీ మొసలికన్నీరు ఆపాలి . ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత నాది .. రైతులు వరి వేయాలి అన్న బండి సంజయ్ ఆ తరువాత మొకం చాటేశారు అని అన్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో యాసంగి వడ్లను కొనుగోలు చేశారు. రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బండి సంజయ్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కునేలకు రాయాలి” అని డిమాండ్ చేశారు . “రైతుబంధుకు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది .. రూ.7500 కోట్లకు రూ.580 కోట్లకు తేడా ఎంతో బండి సంజయ్ ఎవరినన్నా లెక్కలడిగి తెలుసుకోవాలి” అని అన్నారు.

“తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతుల కోసం రైతుభీమాకు చేస్తున్న ఖర్చు రూ.1500 కోట్లు .. రైతుబంధు పథకం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి లేదు అన్నారు. పంటలకు మద్దతుధర గురించి శభాష్ .. శభాష్ అని బండి సంజయ్ చెప్పుకుంటున్నారు .. వరి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.3054, తాజాగా పెంచిన దాని ప్రకారం కేంద్రం క్వింటాలుకు ఇస్తున్న మద్దతుధర రూ.2060 .. బండి సంజయ్ కు మద్దతుధరలపై అవగాహన శూన్యం కాబట్టి కనీసం పత్రికలు అయినా చదివి వివరాలు తెలుసుకోవాలి అని చురుకులు” వదిలారు.

“కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు కాదు. బండి సంజయ్ కి చేతనయితే గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాధన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ + 50 ప్రకారం పంటలకు మద్దతుధరలు ప్రకటించాలి .. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలి. రైతుల సంక్షేమం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, సాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ .. చేతనయితే ఈ పథకాలు కేంద్రం చేత రైతులకోసం దేశమంతా అమలుచేయించాలి” అని సవాల్ చేశారు.

“నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి .. 16 నెలల రైతుల పోరాటానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకున్న చరిత్ర ప్రధాని నరేంద్రమోడీది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ను విమర్శిస్తున్న బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేళ్లలో విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిది” అని అన్నారు.

“వ్యవస్థ మీద, సమాజంలోని సమస్యల మీద ఏ మాత్రం ఆవాహనం లేని, అవగాహన తెచ్చుకోలేని బండి సంజయ్ లాంటి నేతలకు పదవులు ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాళ్లుగా మారాయి .. ఇటీవల బీజేపీ నుండి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను చూసయినా బండి సంజయ్ సిగ్గుతెచ్చుకుని భాష మార్చుకోవాలి. ఫసల్ భీమా పథకంలో అంత పస ఉంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలుచేయడం లేదో అడిగి తెలుసుకోవాలి” అని ప్రశ్నించారు.

పాలమూరు పాదయాత్రలో ఆర్డీఎస్ అంతటికీ సాగునీళ్లు .. ఆరునెలలలో సమస్య పరిష్కారం అని చెప్పిన బండి సంజయ్ ఆ పనులు ఎంతవరకు వచ్చాయో పాలమూరు ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్ కార్పోరేటర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పావలా అయినా హైదరాబాద్ అభివృద్ధి కొరకు తీసుకొచ్చారా ? అని ప్రశ్నించారు.

“పత్రికా ప్రకటనల్లో బట్టలు చించుకోవడం మినహా బీజేపీ నేతలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఏమున్నాయో ప్రజలు గమనించాలి. అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల గురించి రైతుల బాధల గురించి, ప్రభుత్వ బాధ్యతల గురించి బండి సంజయ్ చెప్పడం తాతకు దగ్గు నేర్పినట్లు ఉంది” అని వ్యంగీకరించారు.

“ముఖ్యమంత్రి కేసిఆర్ కు లేఖ రాసే బదులు 30,000 కోట్ల పై చిలుకు కేంద్రం నుండి తెలంగాణా కు రావాల్సిన బాకాయిలు వెంటనే విడుదల చేయాలని దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలి” అని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -