ఈ రోజు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో తడ్కల్ క్లస్టర్ వ్యవసాయ ఏఈఓ శుభాష్ సంతోష్ పెళ్లికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. అయితే ఈ సందర్భంగా ఏఈఓ సంతోస్ పెళ్లి ఖర్చు అయ్యే డబ్బులు రూ.2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. ఈ డబ్బు కరోనా నియంత్రణకు ఉపయోగించాలని కోరాడు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్ నిర్ణయం యువతకు స్ఫూర్థిదాయకం. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు శ్రమిస్తున్న అందరు ఉద్యోగులలో అతని చర్య ఉత్సాహాన్ని నింపుతుంది. కరోనా విపత్తులో కూడా రైతాంగం నష్టపోకుండా గ్రామగ్రామాన పంటలు కొనుగోలు చేస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉద్యోగిగా సంతోష్ అందరికీ ఆదర్శమయ్యాడు. సాధారణ ఉద్యోగి అయినా అసాధారణంగా స్పందించాడని మంత్రి కొనియాడారు. అనంతరం నూతన వధూవరులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు.