హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి- కేటీఆర్‌

186
- Advertisement -

మంగళవారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ,కాంగ్రెస్‌ తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ క‌చ్చితంగా గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేత‌ ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌న్నారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉన్నట్లే కనబడటం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చిల‌క జోస్యం చెప్పుకుంటే బెట‌ర్ అని.. పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక‌.. ఇది తొలి ఉప ఎన్నిక‌. త‌న‌ను తాను నిరూపించుకోవాలి క‌దా..? ఎందుకు హుజూరాబాద్‌కు వెళ్ల‌డం లేద‌ని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్ర‌శ్నించారు. కొడంగ‌ల్‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌న్న స‌న్నాసి ఎందుకు రాజ‌కీయ స‌న్యాసం తీసుకోలేద‌న్నారు.

హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కేటీఆర్‌ ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్ ఎక్క‌డ‌ అన్యాయం చేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఈటల రాజేంద‌ర్ పదవుల్లో కొన‌సాగార‌ని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళిత బంధును ప్ర‌వేశపెట్టింది ఈటల రాజీనామా చేసినందుకు కాద‌ని, ఈటల మంత్రి వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలోనే దళిత బంధుకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. తాము ఉప ఎన్నిక‌లో జానారెడ్డినే ఓడించామ‌ని, ఈట‌ల రాజేందర్ అంత‌కంటే పెద్ద నాయ‌కుడా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ బుర‌ద‌ను ఈట‌ల అంటించుకున్నార‌ని ఆయ‌న దెప్పిపొడిచారు.

బీజేపీని ఈట‌ల‌, బీజేపీ ఈట‌ల సొంతం చేసుకోవ‌డం లేదు. జై ఈట‌ల అంటున్నారు త‌ప్ప జై శ్రీరామ్ అని ఎందుకు అన‌డం లేదు అని కేటీఆర్‌ ప్ర‌శ్నించారు. రాజేంద‌ర్ ఎందుకు రాజీనామా చేశారో ఇంత వ‌ర‌కు చెప్ప‌డం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్ప‌కుండా.. వేరే విష‌యాలు మాట్లాడుతున్నారు అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

- Advertisement -