డబుల్ బెడ్ రూం పనులను వేగవంతం చేస్తాం- కేటీఆర్

303
Minister KTR review meeting over Double Bed Room
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  డబుల్ బెడ్ రూం కార్యక్రమం దేశానికే అదర్శంగా ఉండేలా చూస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం కార్యక్రమ అమలు తీరుపైన మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సమావేశానికి మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇతర అధికారులతోపాటు పలు నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులు హజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలోని పక్కా గృహాల నిర్మాణ రంగంలో ఒక మాడల్ గా నిలిచిందన్నారు.

Minister KTR review meeting over Double Bed Room
ముఖ్యమంత్రి నేరుగా ఈ కార్యక్రమం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారని, నగరంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా లక్ష ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. నగరంలో అనేక రకాలైన మౌళిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేలా ప్రణాళికలు వేసామని, వచ్చే రెండేళ్లలోనే స్కైవేలు పూర్తి అయ్యేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కోలుకుని దేశంలోని అత్యధికంగా అఫీస్ స్పెస్ వినియోగం పెరుగుదలలో రాష్ట్రం నంబర్ వన్ గా ఉందన్నారు. దీంతోపాటు రియల్ ఏస్టేట్ రంగ సంస్ధల కోసం వారు కోరిన విధంగా పలు చర్యలు తీసుకున్నామని గుర్తు  చేశారు.

డబుల్ బెడ్ రూం కార్యక్రమంలో పాల్గోనాలని ఈ సమావేశానికి హజరయిన కంపెనీల ప్రతినిధులకు మంత్రి ప్రత్యేకంగా కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం పథకం పేద ప్రజల పట్ల ఒక సామాజిక భాద్యతగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. నగరాన్ని మురికి వాడల రహిత నగరంగా మారేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. ఇందుకోసం మురివాడల ప్రజలను ఒప్పించేందుకు ప్రభుత్వం, యన్జీవోల సహాకారం తీసుకుని ఇన్ సిట్యూ( ఉన్న చోటనే) పద్దతిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఇప్పటికే సిమెంట్ కంపెనీలతోనూ చర్చించామని, కొంత తక్కువ ధరకు సిమెంటు అందించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు.
 Minister KTR review meeting over Double Bed Room
దీంతోపాటు ప్రభుత్వం ఇసుక సైతం ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పెద్ద ఎత్తున ఒకే చోట కట్టే ప్రాంతాల్లో విద్య, వైద్య ఇతర సామాజిక మౌళిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హడ్కో నిధులు అందుబాటులో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులో ఏలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి  కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో మరో 600 ఎకరాలను ఈ డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి గుర్తించామని తెలిపారు.

ప్రభుత్వం తమతో సమావేశం అవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నిర్మాణ రంగ ప్రతినిధులు, సమావేశంలో ఉన్న అధికారులతో నేరుగా పలు అంశాలపైన చర్చించారు. జియచ్ యంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి వేసిన టెండర్ల గడువు మరో 5 రోజుల పాటు పొడగిస్తే ఎక్కవ మందిని అందులో పాల్గోంటామని కోరారు.  దీంతోపాటు సంస్ధలు కోరిన పలు సానూకూల మార్పులకు సైతం మంత్రి అంగీకరించారు.

- Advertisement -