ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం..

288
Minister KTR Review
- Advertisement -

నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వారికి పలు సూచనలు చేశారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని కోరారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పనిచేయాలని సూచించారు. తక్షణ సహాయం అందిస్తూనే మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని, అక్కడ అవసరం అయిన టాయిలెట్స్, దుప్పట్లు, మందులు, భోజనాలు అందేలా చూడాలన్నారు.

ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని, ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు మంత్రి కేటీఆర్‌. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

- Advertisement -