వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్

180
ktr
- Advertisement -

జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వరద ముప్పు ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు..భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే సూచనలు ఉన్న నేపథ్యంలో మంత్రి జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ అంజయ్య తో ఫోన్ లో మాట్లాడారు.

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ఉన్నత అధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలన్నారు.

ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గర్లో గల గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రిస్క్యూ చేసే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించేలా ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

కాగా ఇప్పటికె ఇల్లంతకుంట మండలం అనంతగిరి, వేములవాడ మండలం కోనాయిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, గంబిరావుపేట మండలం జగదాంబ తండా లో ముంపుకు గురైన వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని అధికార యంత్రంగం మంత్రి కి తెలియజేశారు.

అనంతగిరిపై ఎమ్మెల్యే రసమయికి పోన్…
ఇల్లంతకుంట మండలం అనంతగిరి భారీ వర్షాలకు ముంపుకి గురికావడం పై మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పోన్ లో మాట్లాడి సహాయక చర్యలపై చర్చించారు. ప్రత్యేక వాహనాలను పెట్టి నీటిని బయటకి పంపే ఏర్పాట్లు జిల్లా యంత్రంగం చేస్తుందన్నారు. స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించాలని రసమయికి సూచించారు.

- Advertisement -