ఐటీ..బెంగళూరును దాటేసిన హైదరాబాద్‌

23
- Advertisement -

హైదరాబాద్ ఐటీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. దేశంలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20% హైదరాబాదు నుంచే పనిచేస్తున్నారని తెలిపారు కేటీఆర్. ఇది తెలంగాణకు గర్వకారణం అని…రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014లోనే చెప్పాము. గత 8ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అన్నారు.

తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల బలోపేతం పాటు ఇన్నోవేషన్ ఈకో సిస్టంను మరింత అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ టి హబ్ ను ఏర్పాటు చేశామన్నారు.

తర్వాత హైదరాబాద్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని ఏర్పాటు చేశాం. దానితోపాటు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో ప్రత్యేకంగా శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశాము. త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి వర్క్స్ ప్రారంభం చేయనున్నాం అన్నారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పనిచేస్తున్న స్కై రూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయి, విజయవంతంగా వృద్ది పదంలో దూసుకెళ్తున్నాయన్నారు.

హైదరాబాద్లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉంది. త్వరలో మరిన్ని స్టార్ట్ అప్స్ విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉందన్నారు. భారతదేశంలో ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాలు సంఖ్యలో మొదటిసారి బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటింది. హైదరాబాద్ సాధించిన ఈ ఘనత నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆఫీస్ స్పేస్ వినియోగం విషయంలో బెంగళూరు ని అనేక పర్యాయాలు హైదరాబాద్ దాటినా, అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలవడం గర్వకారణం అని తెలిపారు కేటీఆర్.

8 సంవత్సరాల కింద మేము ప్రారంభించిన టాస్క్ (TASK) ద్వారా 7 లక్షల మందికి పైన యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించాం అన్నారు. ఈ శిక్షణ కేవలం ఐటి రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ ఈ శిక్షణ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని పదిలక్షల గృహాలకు ఇంటర్నెట్ ని అందించే టి- ఫైబర్ ఈ సంవత్సరం పూర్తవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 3000కు పైగా వైఫై హాట్ స్పాట్ ల ద్వారా అందిస్తున్న వైఫై విజయవంతం అయిందన్నారు.

సమాజాహితం కోసం పనికిరాని సాంకేతిక పరిజ్ఞానం వృధా అనే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు పనిచేస్తున్నామన్నారు. పౌరులకు సేవలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ మీ-సేవా అత్యుత్తమమైనదిగా ఉందని చెప్పవచ్చు అని తెలిపారు కేటీఆర్. పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్ ల రెనేవల్, ఈ -ఓటింగ్ వంటి అనేక ప్రభుత్వ సేవలలో పెద్ద ఎత్తున నూతన టెక్నాలజీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం మాది అన్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల తో పాటు సోషల్ ఇన్ఫ్రా కూడా బాగా బలోపేతం అయిందన్నారు. గత 8 సంవత్సరాలుగా ఒక నగరంలో అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు అన్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశాం…త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగునీటి శుద్ధి వంద శాతం జరుగుతుంది, ఇంతటి ఘనత దేశంలో ఏ నగరానికి లేదు అన్నారు. 2050 వరకు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను నిర్మాణం చేస్తున్నాం అని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోతో పాటు ఎయిర్పోర్ట్ మెట్రో వంటి మరిన్ని ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాం అన్నారు. హైదరాబాద్ ఐటి పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించాలి…. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతోపాటు, తెలంగాణలోని ఇతర నగరాలకు కూడా ఐటి పరిశ్రమ తీసుకుపోయే విషయంలో ఐటీ సంస్థలు ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఐటి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేసింది. పలు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటి టవర్లను ఏర్పాటు చేశాం అన్నారు.

అదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటి కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. వరంగల్లో ఇప్పటికే పలు కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో భారత దేశంలో మరిన్ని ఐటి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా వచ్చే ఉద్యోగాల విషయంలో కంపెనీలు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థ, అక్కడున్న విద్యార్థులతో ఐటి కంపెనీలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఎక్కడ అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. ఐటి పరిశ్రమ ఉన్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామన్నమాట సరికాదు. భవిష్యత్ అవసరాలకనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసే ప్రయత్నం జిహెచ్ఎంసి చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -