గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరేస్తాం : కేటీఆర్

193
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్..ఆరేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా మారిందన్నారు.బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసి తీరుతామన్నారు.

మెరుగైన ఉపాధి అవకాశాల కోసం టీఎస్‌ ఐపాస్‌ను తీసుకొచ్చామన్నారు.హైదరాబాద్ నలు దిక్కులా ఐటీ పార్కులు ఏర్పాటు చేశామని…ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారనుందన్నారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో అనిశ్చిత వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గతంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చామని చెప్పారు. పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

నిర్మాణ రంగం వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటుచేశామన్నారు. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు భరోసా కల్పించామన్నారు. మహిళలను ప్రోత్సహించడానికి వీ హబ్ ఏర్పాటుచేశామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుందన్నారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్నారు. శానిటేషన్ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచామన్నారు.అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొచ్చి కఠిన నిబంధనలు తీసుకొస్తామని చెప్పారు.నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు.గ్రేటర్ ప్రజలు అభివృద్ధికి ఓటేసి…టీఆర్ఎస్‌ను ఆదరించాలని కోరారు. హైదరాబాద్ లో అల్లర్లు లేవు…కర్ఫ్యూ లేవన్నారు.

- Advertisement -