కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని ఆదర్శ టౌన్ షిప్ తయారు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదల కోసం పక్కా ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదని, కొల్లూరులో తాము చేస్తున్న నిర్మాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
ఇప్పటికే సుమారు పది రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించి తమ ప్రయత్నాన్ని అభినందించారని, నిర్మాణం పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఖచ్చితంగా కొల్లూరు టౌన్షిప్ నమూనాను అధ్యయనం చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాసి కన్నా వాసి ముఖ్యం అన్న తీరుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సకల హంగులతో చేపడుతుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రతి చోట అన్నిరకాల కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాన దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈరోజు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, హౌసింగ్ మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. దాదాపుగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, దీనికి అదనంగా నిర్మించాల్సిన మౌలికవసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. మొత్తం 15660 ఇళ్లను, 117 బ్లాకుల వారీగా నిర్మాణం చేస్తున్నామని, దీనికి అదనంగా రోడ్లు, తాగు నీటి వసతి, మురుగు నీటి వసతి, విద్యుత్ సరఫరా వంటి ఇతర మౌళిక సదుపాయాల నిర్మాణము కొనసాగుతుందని వారు తెలియజేశారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి వెళ్లి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. దీంతోపాటు కొనసాగుతున్న ఇతర పనులను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా టౌన్షిప్ నిర్మాణం జరుగుతున్న తీరు, పనుల పట్ల మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం టౌన్షిప్ లోనే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వతా ఇక్కడ నివసించే జనాభా ఒక మున్సిపాలిటీలో స్థాయిలో ఉంటుందని, ఈ నేపథ్యంలో ఒక మునిసిపాలిటీలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పించాల్సిందిగా పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా పాఠశాల, హాస్పిటల్, పార్కులు, మంచినీటి సదుపాయం, మురుగునీటి శుద్ధి, నిర్వహణ, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ మొదలయిన కనీస సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొల్లూరు టౌన్షిప్ క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ ప్రాంతంగా తయారు చేసేందుకు అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల ఎర్పాటు, గ్రీనరీ పెంచేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలన్నారు.
కొల్లూరు నగర విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఈ నేపథ్యంలో ఇక్కడ ఇల్లు పొందే లబ్దిదారులకు, అన్ని విధాల అండగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, ఇక్కడికి చేరుకున్న తర్వాత వారికి అన్ని సౌకర్యాలు ఉన్న ఒక అదర్శ పట్టణంలో ఉన్నామన్న భావన కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తోపాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మరియు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Minister stated that this township will soon become a role model dignity housing project in the country. He instructed officials to take steps to ensure the township becomes a safe, smart and sustainable habitation. pic.twitter.com/yLIchX9JWn
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 23, 2019