ఇది తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం- మంత్రి కేటీఆర్

111
ktr
- Advertisement -

సోమ‌వారం రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎల‌క్ర్టానిక్స్ యూనిట్‌లో కొత్త ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ కంపెనీ నుంచి 50 ల‌క్ష‌ల టీవీలు త‌యార‌వ్వ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ఇది అని పేర్కొన్నారు. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికి పైగా ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. యూనిట్ ప్రారంభంలో సంవ‌త్స‌రానికి 4 ల‌క్ష‌ల టీవీలు త‌యారు చేద్దామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. నెల‌కు 4 ల‌క్ష‌ల టీవీలు త‌యారు చేసే స్థాయికి ఎదగ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇది తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం అన్నారు. ఉద్యోగుల్లో 53 శాతం మ‌హిళ‌లు ఉండ‌గా, 60 శాతం తెలంగాణ వారే ఉన్నార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రేడియంట్ కంపెనీ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి క‌లిగిన‌ శ్యాంసంగ్, వ‌న్ ప్ల‌స్, పాన‌సోనిక్, అమెజాన్ స్కైవ‌ర్త్, నోకియా, మోటోరోలా లాంటి వాటిని త‌యారు చేస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు. మా కంపెనీ ఆదాయం 35 రెట్లు పెరిగింద‌ని కంపెనీ యాజ‌మాన్యం తెలిపింద‌న్నారు. ఈ ఆదాయం పెర‌గ‌డానికి కార‌ణం.. తెలంగాణ‌లో ఉన్న సానుకూల వాతావ‌ర‌ణం వ‌ల్లే త‌మ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింద‌ని వారు తెలిపిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

గ‌త కొన్నేండ్ల నుంచి క‌రెంట్ కోత‌లు లేవు. క‌రెంట్ కోత‌లుంటే ప‌రిశ్ర‌మ‌లు స‌రిగా న‌డ‌వ‌వు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో క‌రెంట్ కోత‌ల‌ను అధిగ‌మించాం. ప‌రిశ్ర‌మల‌కే కాకుండా అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎల‌క్ట్రానిక్ పరిక‌రాల ఉత్ప‌త్తి రంగంలో రాబోయే ప‌దేండ్ల‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల‌ కోట్ల ఆదాయం, 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించ‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంద‌ని, స్థిర‌మైన ప్ర‌భుత్వం, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు ఉన్నందునే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని ఉద్ఘాటించారు.

- Advertisement -