మోదీపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్..

83
ktr fire on modi
- Advertisement -

సోమవారం నారాయ‌ణ‌పేట జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వ‌, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన నారాయణపేట ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. రూ. 81 కోట్ల 94 ల‌క్ష‌ల 45 వేలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి ప్రారంభోత్స‌వం చేసుకున్నామ‌ని చెప్పారు. రూ. కోటి 68 ల‌క్ష‌ల‌తో 33/11 కేవీ స‌బ్ స్టేష‌న్ ప్రారంభించుకున్నాం. రూ. కోటి 35 ల‌క్ష‌ల‌తో నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభించుకున్నాం. కొన్ని పార్కులు కూడా ప్రారంభించుకున్నాం. బంగారం మార్కెట్‌ను ఆధునీక‌రిస్తూ రూ. 20 కోట్ల‌తో గోల్డ్ సూప్‌కు శంకుస్థాప‌న చేశాం. సంవ‌త్స‌ర కాలంలో పూర్తి చేస్తామ‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా దీన్ని త‌యారు చేస్తామ‌న్నారు. రూ. 2 కోట్ల‌తో గ్రంథాల‌యాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రూ. 6 కోట్ల 65 ల‌క్ష‌ల‌తో మినీ స్టేడియానికి శంకుస్తాప‌న చేశాం. మ‌రో రూ. 4 కోట్ల‌తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు అనుమ‌తులు ఇస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ర‌జ‌కుల కోసం ఆధునీక‌మైన దోబీ ఘాట్ రూ. కోటితో శంకుస్థాప‌న చేసుకున్నామ‌ని తెలిపారు. చిన్న పిల్ల‌ల ఆస్ప‌త్రి స‌మీపంలో మున్సిప‌ల్ కాంప్లెక్స్ కు శంకుస్థాప‌న చేశాం. 12 కోట్ల‌తో డ్రైనేజీ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశాం. కొండారెడ్డిప‌ల్లి చెరువును రూ. 4 కోట్ల‌తో మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతాం. వ‌చ్చే వినాయ‌క చ‌వితి నాటికి పూర్తి చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లా కేంద్రాల్లోనే వృద్ధాశ్ర‌మాలు ఉన్నాయి. అందులో భాగంగా మెట్ల బావి వ‌ద్ద వృద్ధాశ్ర‌మాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నామ‌ని తెలిపారు. ఒక చైల్డ్ హోంను రూ. 87 ల‌క్ష‌ల 45 వేల‌తో నిర్మాణం చేసి, సంవ‌త్స‌ర లోప‌ల అందుబాటులోకి తీసుకొస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. రాజేంద‌ర్ రెడ్డి గొప్ప ఎమ్మెల్యే అని కొనియాడారు. స‌మ‌ర్థ‌త‌, ద‌క్ష‌త క‌లిగిన నాయ‌కుడు అని ప్ర‌శ‌సించారు. రాజేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్యే కావ‌డం ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపీ నాయ‌క‌త్వంపై రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప‌చ్చి అబ‌ద్ధాల‌తో పాల‌మూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పాల‌మూరు ప‌చ్చ‌బ‌డుతుంటే కొంత మంది కండ్లు ఎర్ర‌బ‌డుతున్నాయి.. చెరువులు నిండుతుంటే కొంత‌మంది గుండెలు మండుతున్నాయ‌ని కేటీఆర్ ఘాటుగా విమ‌ర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్త‌శుద్ధి ఉంటే సుష్మా స్వ‌రాజ్ ప్ర‌క‌టించిన మాదిరిగా పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా క‌ల్పించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కృష్ణా జ‌లాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్ర‌భుత్వం విఫ‌లం చెందింద‌ని కొంద‌రు ప‌నికిమాలిన మాట‌లు, ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారికంగా లెక్క‌లు చెప్తున్నా.. కృష్ణా న‌దిలో ఉమ్మ‌డి ఏపీలో 811 టీఎంసీలు మ‌న‌కు కేటాయింపులు ఉండే. రాష్ట్రం ఏర్ప‌డి ఎనిమిదేండ్లు అవుతోంది.. అప్ప‌ట్నుంచి కేంద్రాన్ని అడుగుతున్నాం.. కృష్ణా జ‌లాల్లో 811 టీఎంసీల హ‌క్కు ఇవ్వాల‌ని, పంప‌కాలు తేల్చాల‌ని అడిగాం. ప్రాజెక్టులు క‌ట్ట‌కుండా స‌తాయించిన జిల్లా పాల‌మూరు జిల్లాతో పాటు న‌ల్ల‌గొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండ‌ని 8 ఏండ్ల నుంచి కోరుతూనే ఉన్నాం. స్వ‌యంగా మోదీని కేసీఆర్ అడిగారు. అయినా ఉలుకుప‌లుకు లేదు. సెక్ష‌న్ 3 కింద బ్రిజేశ్‌ కుమార్ ట్రిబ్యున‌ల్‌కు రెఫ‌ర్ చేయాల‌ని అడిగాం. దున్న‌పోతు మీద వాన‌ప‌డ్డ‌ట్టు ఉంది. ఉలుకు ప‌లుకు లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

పాద‌యాత్ర‌లు చేస్తూ ప‌చ్చి అబ‌ద్ధాలు..
పాల‌మూరు జిల్లాకు చేసిందేమీ లేకపోగా పాద‌యాత్ర‌లు చేస్తూ ప‌చ్చికారుకూత‌లు, ప‌చ్చి అబ‌ద్ధాల‌తో పాల‌మూరు రైతాంగాన్ని మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిగ్గులేని మాట‌లు మాట్లాడుతున్నారు. 299 టీఎంసీల‌కు సీఎం కేసీఆర్ ఒప్పుకున్నార‌ని అబ‌ద్ధాలు చెబుతున్నారు. ద‌మ్ముంటే, ప‌లుకుబ‌డి ఉంటే, మోదీకి చిత్త‌శుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. సుష్మా స్వ‌రాజ్‌ హైద‌రాబాద్‌లో స‌భ పెట్టి పాలూమురుకు జాతీయ హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మోదీకి చిత్త‌శుద్ధి ఉంటే సుష్మా మాట నిలబెట్టి.. పాల‌మూరుకు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అమిత్ షా జాతీయ హోదా ఎక్క‌డ‌?
ప‌క్క‌నే ఉన్న కర్ణాట‌క‌లోని తుంగ‌భ‌ద్ర న‌దిపై ఉన్న‌ అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇస్త‌రు. కానీ మేం అడిగితే విన‌బ‌డ‌న‌ట్టు ముందుకు పోత‌రని అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమిత్ షాకు నీతి, నిజాయితీ, సిగ్గు ల‌జ్జ ఉంటే తెలంగాణ‌కు కృష్ణా జ‌లాల్లో 511 టీఎంసీలు కేటాయించి, వెంట‌నే పాల‌మూరుకు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ఉత్త‌గ మాట‌లు చెప్పుడు కాద‌ని అమిత్ షాపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఈ సభలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, డా. సి లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సురభి వాణీ దేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -