తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారం పర్వం జోరు సాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో తాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామంటూ పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే. తాము సీఎం కేసీఆర్ సార్కే అండగా ఉంటామని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే తాము గెలిపిస్తామంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు.
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని, టీఆర్ఎస్సే మళ్లీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ ఉతుత్తి హామీలు, కాంగ్రెస్ ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో పాతరేసేందుకు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను ఓడించే సత్తాలేని పార్టీలన్నీ ఒక్కటైనా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని అందరూ చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు.. పొత్తులు పెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
ఇక టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ ఖర్చులకు ప్రజలు అభిమానంతో డబ్బులు ఇస్తున్నారు. కేటీఆర్ ఎన్నికల ఖర్చులకోసం తమ ఒకరోజు వేతనం మొత్తం రూ.11,011లను స్థానిక నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు విరాళంగా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పావని, సెస్ వైస్చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.