నాటి ఆత్మహత్యలను చూసి సీఎం చలించారు:కేటీఆర్‌

67
- Advertisement -

సమైక్యరాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలను, నాటి ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత జౌళిరంగం అని కేటీఆర్‌ తెలిపారు.

నాటి ఉద్యమ సమయంనుంచి చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి కేసీఆర్‌కు తెలుసు. భూదాన్‌ పోచంపల్లిలో ఒకటే వారంలో ఎనిమిది మంది చేనేత కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ చలించిపోయి, జోలేపట్టి డబ్బులు సేకరించి, లక్ష రూపాయాల చొప్పున ఇచ్చారు. ఎవరూ చావొద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులను కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేనేత కళాకారులను కేసీఆర్ ఆదుకుంటున్నారు.

సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతన్న చావొద్దు.. నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నాటి కలెక్టర్ రాయించి, ఆత్మస్థైర్యం నింపారు. సిరిసిల్లలో తొమ్మిది మంది నేతలు బలవన్మరణం పాల్పడితే.. వారిని ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. కానీ స్పందించలేదు.

నాటి కరీంనగర్‌ పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ నుంచి రూ. 50లక్షలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి. ఆత్మహత్యలు ఆపండి అని కేసీఆర్ నాటి అధికారులను ఆదేశించారు. ఆనాడు మీ కష్టాలను అర్థం చేసుకుని, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత, జౌళి బడ్జెట్‌ ను రూ. 70 కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు పెంచారు. చేనేత, జౌళి శాఖకు ఇప్పటి వరకు రూ. 5,752 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

మన డిజైన్లు మనకే సొంతం..కాపీ కొడితే కేసులు తప్పవన్నారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అధికారులను పిలిచి సీఎం సమీక్షించారని కేటీఆర్ గుర్తు చేశారు. నెలకు ఎంత ఆదాయం వస్తున్నదని అడిగారు. మీ డిజైన్లను కాపీ కొడితే కఠినంగా కేసులు పెట్టి, లోపల వేయించే బాధ్యత తీసుకుంటాను. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.

చేనేత మిత్ర ద్వారా నలభై శాతం నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇస్తున్నాం. పాత బకాయిలు ఉంటే వాటిని కూడా సంపూర్ణంగా విడుదల చేయిస్తామన్నారు. నేతన్నకు చేయూత అనే కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఈ పథకం ద్వారా కరోనా సమయంలో 26 వేల మంది కార్మికులకు లాభమైందని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -