రిస్టోరేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి: కేటీఆర్

170
ktr
- Advertisement -

భారీ వర్షాల అనంతరం ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించాలని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. ఇప్పటిదాకా వరదల సమయంలో చేపట్టిన సహాయ కార్యక్రమాలతో పాటు వరదల  అనంతరం నగరాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన మంత్రి మరోసారి ఈరోజు మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మరియు జలమండలి, విద్యుత్ శాఖల నుంచి పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

ప్రస్తుతం ప్రభుత్వం వరద బాధితుల కోసం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ సహాయానికి సంబంధించిన కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నదని దాదాపుగా రేపటి వరకు వరద ప్రభావిత కుటుంబాలన్నింటికీ ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని జిహెచ్ఎంసి అధికారులు మంత్రికి తారకరామారావు కి తెలియజేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన సిబ్బంది పెద్ద ఎత్తున నగరంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ఈ సానిటేషన్ డ్రైవ్ మంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టామని, ప్రస్తుతం వరద ప్రభావిత కాలనీలలో పెద్ద ఎత్తున డిస్ఇన్ఫెక్తంట్ చల్లడం తో పాటు బురద తొలగింపు, చెత్త తరలింపు వంటి కార్యక్రమాలను అదనపు సిబ్బంది సహాయంతో కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో మూడున్నర వేల మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను సేకరించి తరలిస్తున్నామని జిహెచ్ఎంసి అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.

ఇప్పటిదాకా సుమారుగా 18 వేల మెట్రిక్ టన్నుల వరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా చెత్తను సేకరించి తరలించామన్నారు. ఇంకా ఎక్కడైనా చెత్త ఉంటే జిహెచ్ఎంసి కి ఫోన్ చేసి చెప్తే తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని , ఇందుకు సంబంధించి ఫోన్ నెంబర్లను జిహెచ్ఎంసి విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిహెచ్ఎంసి చేపడుతున్న సహాయక మరియు రిస్టోరేషన్ కార్యక్రమాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లతోపాటు పలు ఎన్జీవోల ను భాగస్వాములను చేసుకునే ప్రయత్నం చేస్తే మరింత బాగుంటుందని మంత్రి కేటీఆర్ సూచించారు. వరదల వలన చెడిపోయిన రోడ్లను తిరిగి మరమ్మతులు చేసే కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రతి సర్కిల్ వైజ్ గా రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే నగరంలోని ప్రధాన మార్గాలపై ఈ మరమ్మతు పనులను ప్రారంభించాలని, తద్వారా ప్రజలకి ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.

గతంలో ఉన్న ఫ్లైఓవర్ లకు సంబంధించి వాటి పైన ఉన్న వర్షపు నీరు కిందికి పోయేందుకు ఏలాంటి సౌకర్యం లేదని, వర్షపు నీరు సాఫీగా కిందకి వెళ్లేలా రెట్రో ఫిట్టింగ్ అన్ని ఫ్లైఓవర్ లకు  చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.ఇప్పటికి చెరువులకు సంబంధించిన మరమ్మతు లేదా చెరువు కట్టల బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాల పైన సాగునీటి శాఖ సిబ్బంది ద్వారా కొన్ని సూచనలు వచ్చాయని ఆ మేరకు వివిధ కార్యక్రమాలు తీసుకున్నట్లు అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. చెరువులతో పాటు నాలలోనూ వరదల వలన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందని వీటిని తొలగించే కార్యక్రమాలు సైతం చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. నగర పరిసర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వరద అనంతరం చేపడుతున్న సహాయక మరియు పునరావాస చర్యల పైన  కేటీఆర్ ఈ సందర్భంగా సిడిఎమ్ ఏ సత్యనారాయణను  వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో సైతం ఈ కార్యక్రమాలను వేగంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -