ఆధ్యాత్మిక హబ్‌గా ముచ్చింతల్‌ ఆశ్రమం -మంత్రి జగదీష్ రెడ్డి

62
- Advertisement -

ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ రామనుజుల స్వామి వారి విగ్రహం యావత్ భారత దేశాన్ని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక హబ్ గా మారనుందని ఆయన చెప్పారు. స్వామీ వారి ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ రామనుజుల స్వామి వారి విగ్రహాన్నిఆవిష్కరించేందుకు గాను జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి టి యస్ యస్ పి డి సి యల్ సి యం డి రఘుమారెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి,జగత్ రెడ్డి లతో కలసి సందర్శించారు.

ఫిబ్రవరి 2 నుండి 14 వరకు జరుగు కార్యక్రమలపై శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి వారితో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రధాని తో పాటు ముఖ్యమంత్రులు,గవర్నర్లు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అధికారులు, అనాధికారులు తరలి రానున్నందున విద్యుత్ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రసారంలో రెప్పపాటు అంతరాయం కలుగ కుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోనీ యజ్ఞశాల,బోజనాది శాలలలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ ఏర్పాట్లను ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. పదిరోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవం లో నిరంతరం విద్యుత్ సరఫరాను సమీక్షించేందుకు ప్రత్యేక విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.అందులో భాగంగా విద్యుత్ ప్రసారాలు నిరంతరాయంగ ఉండేలా చూడడంతో పాటు ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే 33/11కేవీ సబ్ స్టేషన్ 28 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.మొత్తం 10 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నలుమూలల నుండి తరలి వస్తున్న ప్రముఖులు,ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులు వివిధ రంగాల నుండి తరలి వస్తున్న వారికి విద్యుత్ పరంగా ఎటువంటి ఆటంకాలు కలుగ కుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -