బడ్జెట్‌పై మంత్రి అల్లోల హ‌ర్షం..

219
Minister Indrakaran Reddy
- Advertisement -

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపకల్పన చేశారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని తెలిపారు. ద‌ళిత అభ్యున్న‌తికి రూ. వెయ్యి కోట్ల నిధుల‌తో ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ అనే ప‌థ‌కాన్ని రూపొందించి… సీఎం కేసీఆర్ షెడ్యూల్ కులాల వ‌ర్గాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ కేటాయింపులు చేశార‌ని, ఎస్సీ, ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం భారీగా నిధులు కేటాయింంచ‌డం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తాను నిర్వ‌హిస్తున్న‌‌, అట‌వీ, దేవాదాయ‌, న్యాయ శాఖ‌ల‌కు అధిక‌ బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ బ‌డ్జెట్‌లో అట‌వీ శాఖ‌కు రూ.1,276 కొట్లు, దేవాదాయ శాఖ‌ రూ.720 కోట్లు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు దేవాలయాల అభివృద్ది ప‌నులు, దేవాలయాల్లో ధూప, దీప నైవేద్య పథకం అమ‌లు, అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చిస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందించారు.

- Advertisement -