రాహుల్ గాంధీది ఐరెన్ లెగ్.. ఎక్కడ అడుగుపెట్టినా ఓటమే..

45
- Advertisement -

శుక్రవారం నిజామాబాద్ జిల్లా, బాన్సువాడలో జకోరా ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీష్‌ రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. జకోర లిఫ్ట్ అందుకోబోతున్న మీ అందరికీ శుబాకాంక్షలు. ఇది మంచి పని. పోచారం శ్రీనివాస్‌ శాసన సభా పతిగా మీకు ఎమ్మెల్యేగా ఉండటం మీ అదృష్టం. ఇంత ఎండలో వచ్చిన ఇన్ని వేల మంది ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. పెట్టుబడి లేదు, పైపుల్ లేవు, కరెంటు ఖర్చు లేదు. జకోరా లిఫ్ట్ ద్వారా మీకు నీరు వస్తుంది. మీ కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్, బీజేపీలకు కళ్లు మండుతున్నయి. నీళ్లు వస్తున్నయి అంటే వాళ్లకు కన్నీళ్లు వస్తున్నయి. పంట పండుతున్నదంటే వాళ్ల గుండెలు మండుతున్నయని మంత్రి పండిపడ్డారు. 99 లక్షల టన్నుల వరి పంట తెలంగాణ వచ్చిన నాడు ఎడాదికి పండేది. ఇప్పుడు తెలంగాణలో పోయిన ఏడాది 2 కోట్ల 59 లక్షల టన్నులు పండాయి అన్నారు.

నిజాం నవాబు కట్టిన ప్రాజెక్టులు తప్ప గత పాలకులు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఇంత పంట పండటానికి తెలంగాణ ప్రభుత్వం కారణం కాదా. యాసంగి పంట కొనమని వెళ్తే మేం కొనం అని ఢిల్లీ వెళ్లిన మంత్రులకు చెప్పారు. చమత్కార్ చేస్తున్నరు. ఇంత పంట ఎలా వస్తుందని కేంద్ర మంత్రి అడుగుతున్నరు. ఏడేళ్లలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసినం, రైతు బంధు ఇచ్చినం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినం, ఎరువుల కొరత లేకుండా చేసుకున్నం. రైతు బీమా వ్యవసాయం పండగ అయింది కాబట్టి ఇంత పంట పండింది.

కేంద్ర మంత్రి పియూష్ గోయేల్ ఎం అంటడు. ఏమైనా మంత్రం వేసిన్రా అంటడు. దక్షిణ భారత దేశానికి అన్నం పెట్టే అంత పంట పండింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతది. రా రైస్ ఇవ్వమంటరు. బీజేపీ వైఖరి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు ఉన్నది. పండేది కొనరు.. పండనిది కొంట అంటరు. లంగ పంచాయతీ ఉన్నది వీళ్లతో.. తెలంగాణలో ఇంత పంట పండుతంది అంటే కళ్ల మంటగా బీజేపీ, కాంగ్రెస్ ఉంది అని హరీష్‌ దుయ్యబట్టారు. నిజాం సాగర్ కాలువ మీద ఆధారపడి ఉండేది. మొఖాన్ని మొగలుకు పెట్టి చూడాల్సిన పరిస్థితి. వర్షం వస్తదా రాదా, పంచాయతీ చూడాలే. నిజాం సాగర్ లో నీళ్లు ఉంటయా ఉండావా.. ఇది అప్పటి పరిస్థితి. సింగూరు నీళ్లు కావాలని రోడ్లపై నిరహర దీక్షలు చేయలేదా.. కొట్లాడ లేదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. కాలమైనా..కాకపోయినా సింగూరు నిండు కుండలా ఉంటది. రెండు పంటలు వేసుకోవచ్చు. ఇవాళ మల్లన్న సాగర్ పూర్తయింది. గేట్ ఎత్తితే నిజాం సాగర్లో బిర బిర నీళ్లు వచ్చినయి. జకోర లిఫ్ట పెడితే మీ పొలాలకు నీరు వస్తుంది అన్నారు.

మా ప్రజలు సుఖపడాలే. మా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కష్టపడాలే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంటు కోత, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవి. పంట కొనరు. కాంగ్రెస్ బీజేపీలు కష్టపడాలి. మా రైతులు సుఖపడాలని టీఆర్ఎస్ కోరుకుంటుంది. బీజేపీ వాళ్లు బాగా మాట్లడతరు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమని మ్యానిఫెస్టోలో చెప్పారు. కాని ఖర్చు మాత్రం రెట్టింపు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు 70 రూపాయల డిజీల్ ఇవాళ 110 రూపాయలు అయింది. ఎకరా ఆనాడు దున్నాలంటే 2 వేలు ఉండేది. ఇవాల 5- 6 వేల రూపాయల కిరాయి అవుతుంది. వరి కోత మిషన్ 1000-1200 రూపాయలకు వస్తుండేది. ఇప్పుడు 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. పెట్టుబడి మాత్రం రెట్టింపు అయింది. మోటర్ సైకిల్ మీద బాయికాడకు పోదాం అంటే పెట్రోల్ ఖర్చు పెరిగింది. పోటాష్, కాంప్లెక్స్ ధరలు బీజేపీ పంచిందని మంత్రి విమర్శలు గుప్తించారు.

నల్ల ధనం తెస్తామని చెప్పి, నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. బీజేపీ మెడలు వంచి దేశ రైతులు పోరాడి నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయించిన్రు. నల్ల చట్టాలు తెస్తే టాటా, అంబానీలకు మన భూములు ఇచ్చి ఆ భూముల్లో కూలీలు అయ్యే వాళ్లం. బీజేపీ ఏం చేసింది రైతుల కోసం. టీఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినం. ఇందులో కూడా కిరికిరి చేస్తున్నరు బీజేపీ వాళ్లు. బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తం అని అంటున్నరు. పెట్టాల్నా.. మన పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 35 వేల కోసం సంతకం పెట్టి బాయిల కాడ మీటర్లు పెడుతున్నరు. మన సీఎం ఒక పూట అన్నం తక్కువ తిన్నా, ఒక పని తక్కువ చేసుకున్నా సరే. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టేది లేదని చెప్పిండు. పక్క సీఎం 7 వేల కోట్లు తెచ్చుకుని బాయిల కాడ మీటర్లు పెడుతున్నరు.

నూకల భారం 3 వేల కోట్లు రాష్ట్రం పై పడినా, కేంద్రం తొండాట ఆడుతుందని తెల్సి. మన రైతులు నిలబడాలని ఆ భారం తెలంగాణ ప్రభుత్వం మోస్తోంది. సింగూరు ఇక భవిష్యత్తులో ఎండదు, నిజాం సాగర్ ఎండదు. ఎరువుల కొరత లేకుండా చూసినం. ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం తెచ్చుకున్నం. రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇస్తున్నం. బీజేపీ వాళ్లు ఇంత మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ వాళ్ల కోసం మీకు తెలుసు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చూశాం. కాలిపోయో మోటర్లు, పెలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, కాంగ్రెస్ అంటే మందు బస్తా కోసం పోలీస్ స్టేషన్లు వద్ద లైన్లు కట్టాల్సిన పరిస్థితి. ఎరువుల కొరత, గోడౌన్ల కొరత. ఓ ప్రాజెక్టు కట్టిందిలేదు. నీళ్లు ఇచ్చింది లేదు. ఇంక రాహూల్ గాంధీ వస్తడు. ఉద్దరిస్తడు అంటున్నరు. ఆ రాహూల్ అడుగు పెడితే ఐరన్ లెగ్. ఓడింది తప్ప కాంగ్రెస్ గెల్చుడు ఉన్నదా. ఈ మధ్య కాలంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94 శాతం. గెలిచింది ఆరు శాతం మాత్రమే. ఉన్న పంజాబ్ ఊడింది. యూపీలో ఒక్క సీటు లేదు. హర్యానా లో పత్తా లేదు. పంజాబ్ లోకటీఫ్. ఇక తెలంగామలో ఉద్దరిస్తరా. కాంగ్రెస్ అనేది గతం. వొడిసిన చరిత్ర అని మంత్రి హరీష్‌ ఎద్దేవ చేశారు.

- Advertisement -