ప్రతిపక్షాల విమర్శలకు మా పని తీరుతోనే జవాబు చెబుతున్నాం..

135
harish rao
- Advertisement -

గుక్కెడు మంచి నీళ్ళ కోసం తల్లడిల్లిన ప్రాంతం.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మండుటెండల్లో జలకళను సంతరించుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. కొండ పోచమ్మ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు మంత్రి హరీష్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూడవెల్లి వాగుకు కొత్త దశ,దిశా చూపి పునర్జన్మను ప్రసాదించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిదే. గుక్కెడు మంచి నీళ్ళ కోసం తల్లడిల్లిన ప్రాంతం.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మండుటెండల్లో జలకళను సంతరించుకుంది. 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తీసుకువచ్చి కూడవెల్లి వాగుకు జలకళ తెచ్చామన్నారు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదలలో వెయ్యి ఓల్ట్ ల బల్బు వేస్తే వచ్చే వెలుగు రైతుల కళ్ళలో కనబడుతుందన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు ప్రస్తుత ఫలితాలు చూసి ఈర్ష్య పడుతున్నారు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో లక్షల రూపాయల విలువైన పంటను కాపాడు కోగలిగాం. తెలంగాణ రైతులు మొఖాన్ని మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో వర్షం కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి లేకుండా చేసాం. స్వరాష్ట్రం సాధించుకున్నందువల్లే… సాగు, త్రాగునీటి బాధలకు శాశ్వత పరిష్కారం చూపగలిగామన్నారు. ప్రతి పక్షాల విమర్శలకు మా పని తీరుతోనే సమాధానం చెబుతున్నామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -